కొలంబో: ఇంగ్లండ్ ఆల్రౌండర్ మోయిన్ అలీకి కొత్త రకం కరోనా సోకింది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో ఉన్న అతన్ని ప్రత్యేక క్వారంటైన్కు తరలించారు. శ్రీలంక జట్టుతో ఇంగ్లండ్ నేటి(గురువారం) నుంచి రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ కన్నా ముందే ఈ సిరీస్ జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. క్రికెట్ మళ్లీ మొదలయ్యాక నేటి నుంచి నిర్వహించడానికి ఇరు జట్లూ అంగీకరించాయి. ఈ క్రమంలోనే జనవరి 4న అక్కడ అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించగా.. మోయిన్ అలీకి పాజిటివ్ వచ్చింది.
అయితే అది యూకే స్ట్రెయిన్గా గుర్తించామని శ్రీలంక వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఇక శ్రీలంకలో ఇదే తొలి యూకే స్ట్రెయిన్ కేసు అని చెప్పారు. ఈ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందన్న నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నామని తెలిపారు. అంతకుముందు మిగతా ఆటగాళ్లకు నెగెటివ్ రావడంతో నేటి నుంచి టెస్టు సిరీస్ యథావిధిగా కొనసాగుతందని చెప్పారు. మరోవైపు అలీతో సన్నిహితంగా ఉన్న క్రిస్వోక్స్కు నెగిటివ్ వచ్చిందన్నారు. అయితే, వోక్స్ ఫస్ట్ టెస్టులో ఆడటంపై మాత్రం ఇంగ్లండ్ జట్టు క్లారిటీ ఇవ్వలేదు.