అసలేం జరిగిందంటే..?
రెండో రోజు ఆట సెకండ్ సెషన్లో వెస్ట్ జోన్ పేసర్ చింతన్ గజా వేసిన ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ నాన్ స్ట్రైకర్ దిశగా ఢిఫెన్స్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న గజా.. పరుగు కోసం క్రీజు ధాటిన అయ్యర్ వైపు విసిరాడు. అయితే బంతి నేరుగా అయ్యర్ మెడకు బలంగా తాకింది. దాంతో అయ్యర్ తీవ్ర నొప్పితో మైదానంలో కుప్పకూలాడు. ఫిజియో వచ్చి ప్రాథిమిక చికిత్స చేసినా అతను కోలుకోలేదు. దాంతో నిర్వాహకులు అంబులెన్స్ను రప్పించి ఆసుపత్రికి తరలించారు. దాంతో అతను 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
|
గజ గజ వణికి చింతన్ గజా..
అయితే గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో అతను మళ్లీ మైదానంలోకి దిగాడు. దాంతో వెంకటేశ్ అయ్యర్కు ఏం కాలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా గజా ఈ ఘటనతో గజ గజ వణికిపోయాడు. అయ్యర్ ఏం కాలేదని తెలిసిన తర్వాత మాములు మనిషి అయ్యాడు. ఈ ఘటన ఒక్కసారిగా ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఘటనను గుర్తు చేసింది. ఫిలిప్ హ్యూస్ అకాల మరణం క్రికెట్ చరిత్రలోనే ఓ విషాధ ఘటనగా మిగిలిపోయింది.
8 ఏళ్ల క్రితం..
ఎనిమిదేళ్ల క్రితం (2014, నవంబర్ 25న) ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఇదే తరహాలో రాకాసి బౌన్సర్కు ప్రాణాలు వదిలాడు. ఆసీస్ దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూసౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి పేసర్ సీన్ అబాట్ విసిరిన బౌన్సర్ సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ అయిన ఫిలిప్ హ్యూస్కు బలంగా తగిలింది. హెల్మెట్ ధరించినప్పటికీ రక్షణ లేని ఎడమచెవి కింది భాగంలో(మెడకు) బంతి తాకింది. దీంతో అతను వెంటనే నేలపై కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకొని కోమాలోకి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత సమీపంలోని ఆసుపత్రిలో కన్నుమూశాడు.
128 పరుగులకే ఆలౌట్..
ఈ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో వెంకటేశ్ అయ్యర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 128 పరుగులకే కుప్పకూలింది. గాయం నుంచి కోలుకొని అయ్యర్ మళ్లీ బరిలోకి దిగిన 14 పరుగులకే పరిమితమయ్యాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులు చేయడంతో 129 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ 29 ఓవర్లలో 3 వికెట్లకు 130 పరుగులు చేసింది.