హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ వికెట్ల వెనుక అద్భుతం చేశాడు. ఈ సీజన్లో కోల్కతా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న దినేశ్ కార్తీక్ మైదానంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఈ మ్యాచ్లో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాతో తొలి ఓవర్ వేయిచించిన కార్తీక్ సత్ఫలితం సాధించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
చావ్లా బ్యాట్స్మన్ను ఊరించేలా బంతులేయగా క్రీజు వదిలి ముందుకొచ్చి ఆడిన జేసన్ రాయ్ని స్టంపింగ్ చేశాడు. మళ్లే క్రీజులో బ్యాట్ పెట్టేలోపే మెరుపు వేగంతో దినేశ్ కార్తీక్ వికెట్లను గీరాటేశాడు. గత మ్యాచ్లో చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును గెలిపించిన జేసన్ రాయ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం ఢిల్లీని దెబ్బతీసింది. ఓపెనర్ జేసన్ రాయ్ ఔటైన తర్వాత ఢిల్లీ వరుసగా వికెట్లను కోల్పోయింది.
ఇక దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన శ్రేయస్ అయ్యర్ బౌండరీ బాది స్లిప్లో ఉన్న నితీష్ రాణాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, ఈడెన్ గార్డెన్లో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 71 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 14.2 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది.
ఢిల్లీ ఆటగాళ్లలో రిషబ్ పంత్(43; 26 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సర్), గ్లెన్ మ్యాక్స్వెల్(47; 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే రాణించగా, మిగతా ఆటగాళ్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరారు. ఈ సీజన్లో పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం కావడం విశేషం. కేకేఆర్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ తలో మూడో వికెట్లు సాధించగా, పీయూష్ చావ్లా, రస్సెల్, శివం మావి, టామ్ కుర్రాన్లు తలో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. కేకేఆర్ ఆటగాళ్లు నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు రెండొందల మార్కును చేరింది. రానా 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేయగా, రస్సెల్ 12 బంతుల్లో 6 సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు.
కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్(19) ఔటైన తర్వాత వచ్చిన రస్సెల్.. నితీష్ రానాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ బౌండరీలను దాటించడమే లక్ష్యంగా చెలరేగి ఆడటంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ క్రమంలోనే రాణా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే రాణా హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత రస్సెల్ ఐదో వికెట్గా పెవిలియన్ చేరాడు. మిగతా కేకేఆర్ ఆటగాళ్లలో క్రిస్ లిన్(31), రాబిన్ ఉతప్ప(35) ఫర్వాలేదనిపించారు. నితీష్ రాణాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.