న్యూఢిల్లీ: మహిళల ఐసీసీ ప్రపంచకప్కు ముందు భారత మహిళల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ మార్చేయడమే ఉత్తమమని మాజీ క్రికెటర్ డయాన్ ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియా వేదికగా బుధవారం ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో భారత్ 11 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
సునాయసంగా గెలిచే ఈ మ్యాచ్లో భారత్ చివర్లో వరుసగా వికెట్లు చేజార్చుకొని ఓటమిపాలైంది. ఈ సిరీస్ పరాజయంతో టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జట్టుని నడిపించడంలో విఫలమవుతోందనే విషయం స్పష్టమైందని ఎడుల్జి తెలిపింది. కెప్టెన్సీ ప్రభావం హర్మన్ బ్యాటింగ్పైనా పడుతోందని చెప్పుకొచ్చింది.
ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా దారుణంగా విఫలమయ్యారు. హర్మన్ తన సహజసిద్ధమైన ఆటను ఆడాలంటే..? కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలేమో.. ఆమె ఎందుకో ఇటీవల ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఆమె సారథ్య బాథ్యతల నుంచి తప్పుకుంటే.. ఎవరు కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరిస్తారు..? మంధానాకి అవకాశమిస్తే.. అది ఆమె బ్యాటింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ.. హర్మన్ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది.' అని ఎడుల్జీ అభిప్రాయపడింది.
గత బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ బెత్ మూనీ (71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగింది. భారత బౌలర్లలో దీపిక శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ రెండేసి వికెట్లు తీయగా.. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఆసీస్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ నిర్ణీత ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ స్మృతి మంధాన 66 పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.