ధోనీని వెనక్కి నెట్టడం మా వ్యూహంలో భాగం: నాలుగో స్థానం ఖాళీగా ఉంది: రవిశాస్త్రి

మాంచెస్టర్: ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో దారుణ పరాజయాన్ని చవి చూడటంపై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. న్యూజిలాండ్తో మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఓటమి చవి చూసిన అనంతరం.. ఈ అంశంపై రవిశాస్త్రి స్పందించడం ఇదే తొలిసారి. పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రత్యేకించి- బ్యాటింగ్ లైనప్లో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ విఫలం కావడం, మహేంద్రసింగ్ ధోనీని ఏడో స్థానానికి నెట్టడం.. వంటి అంశాలపై ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీని వెనక్కి నెట్టడంపై
న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా ఆయన అయిదో స్థానంలో క్రీజులోకి దిగుతుంటారు. కీలకమైన సెమీస్ మ్యాచ్లో ధోనీని వెనక్కి నెట్టింది టీమ్ మేనేజ్మెంట్. ఆయన స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ముందుకు తీసుకొచ్చింది. ధోనీ స్థానానికి న్యాయం చేయలేకపోయాడు పాండ్యా. 62 బంతులు ఆడి 32 పరుగులకు అవుట్ అయ్యాడు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సౌరబ్ గంగూలి, సచిన్ టెండుల్కర్ ఈ అంశంపై విమర్శలు గుప్పించారు.
భారత్లో భారత్..ఆసీస్లో ఆసీస్..ఇంగ్లండ్లో ఇంగ్లండేనా ..?

అది జట్టు వ్యూహం..
ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్కు తీసుకుని రావాలనేది జట్టు వ్యూహంలో భాగమేనని రవిశాస్త్రి వివరణ ఇచ్చుకున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ధోని అయిదో స్థానంలోకి వచ్చి, వెంటనే అవుటైతే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లపై భారం పడుతుందని, లక్ష్యాన్ని ఛేదించలేరనే ఒకే ఒక్క కారణంతో- ధోనీని వెనక్కి నెట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఒక నాణ్యమైన, భారీ షాట్లను ఆడగల సత్తా ఉన్న, మంచి ఫినిషర్గా పేరున్న ధోనీని శ్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్కు పంపించడం వల్ల లక్ష్య ఛేదన సులువు అవుతుందని తాము ఆశించామని అన్నారు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమేనని చెప్పారు.

ధోనీ అద్భుతంగా ఆడాడు..
సెమీ ఫైనల్ మ్యాచ్లో ధోనీ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడని రవిశాస్త్రి ప్రశంసించారు. ఎప్పట్లాగే- తన దూకుడు, డిఫెన్స్ను మిళితం చేసి, తాము ఆశించినట్టే నాణ్యమైన క్రికెట్ ఆడాడని అన్నారు. దురదృష్టవశావత్తూ రనౌట్ అయ్యాడని, అదే చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం వేరుగా ఉండేదని చెప్పారు. చివరి ఓవర్ను వేయాల్సిన జిమ్మి నీషమ్ను ఎదుర్కొనడానికి ధోనీ.. మానసికంగా సిద్ధమైపోయాడని అన్నారు. ఇంకా బంతులు మిగిలి ఉండగానే.. టీమిండియా విజయాన్ని అందుకుని ఉండేదని చెప్పుకొచ్చారు రవిశాస్త్రి.

నాలుగో స్థానంలో మంచి బ్యాట్స్మెన్ అవసరం
బ్యాటింగ్ లైనప్లో నాలుగో స్థానం ఇప్పటికీ ఖాళీగా ఉందని రవిశాస్త్రి చెప్పారు. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి ఓ మంచి బ్యాట్స్మెన్ అవసరం ఉందని అన్నారు. త్వరలోనే ఈ లోటును భర్తీ చేస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నాలుగో స్థానం ఎప్పుడూ జట్టుకు సమస్యలు సృష్టిస్తూనే వస్తోందని అన్నారు. నాలుగో స్థానంలో కెఎల్ రాహుల్ ఆడాల్సి ఉండగా.. శిఖర్ ధావన్ గాయపడటం వల్ల అతణ్ని ఓపెనింగ్కు పంపించాల్సి వచ్చిందని చెప్పారు. అలాగే- విజయ్ శంకర్ను తీసుకోగా.. ఏకంగా అతనే గాయపడ్డాడని అన్నారు. ఈ లోటును భర్తీ చేయగల బ్యాట్స్మెన్ కోసం చూస్తున్నామని అన్నారు.

రిషబ్ పంత్ ఇంకా నేర్చుకోవాల్సి ఉంది..
ప్రస్తుతం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తోన్న రిషబ్ పంత్ ఇంకా నేర్చుకోవాల్సి ఉందని రవిశాస్త్రి అన్నారు. ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. ఆరంభ ఓవర్లలో తడబడుతున్నాడని, దీని ఫలితంగా భారీ షాట్లను ఆడలేకపోతున్నాడని అన్నారు. కాస్త కుదురుకున్నాక భారీ షాట్లు ఆడబోతూ అవుట్ అవుతున్నాడని చెప్పారు. నిలకడలేమిని సూచిస్తోందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. అతని బలహీనతలను ఫాస్ట్ బౌలర్లు కని పెట్టారని, దానికి అనుగుణంగా బంతులను వేయడం ద్వారా సులభంగా అవుట్ చేయగలుగుతున్నారని అన్నారు.

రవీంద్ర జాడేజా..ఓ అద్భుతం
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెమీస్లో అద్భుత ఇన్నింగ్ ఆడాడని రవిశాస్త్రి ప్రశంసించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ నాణ్యమైన క్రికెట్ ఎలా ఆడాలో చూపించాడని అన్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్లో అన్ని మ్యాచ్లను జడేజా ఆడనప్పటికీ.. ఆడిన మ్యాచ్లల్లో తానేమిటో నిరూపించుకున్నాడని చెప్పారు. ఆల్ రౌండర్ అనే పదానికి అసలు, సిసలు నిర్వచనం ఇచ్చాడని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications