లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్ గెలిచే అవకాశం ఆతిథ్య జట్టుకే ఉందా? గత రెండు ప్రపంచకప్ టోర్నమెంట్ల ఫలితాలు అవుననే చెబుతున్నాయి. 2011, 2015 ప్రపంచకప్ టోర్నమెంట్లను నిర్వహించిన దేశాలే ప్రపంచకప్ను ఎత్తుకున్నాయి. 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహించాయి. ఈ రెండు సార్లు కూడా ఆతిథ్య జట్లే గెలుపొందాయి.
2011, ఏప్రిల్ 2వ తేదీన కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో.. భారత క్రికెట్ జట్టు శ్రీలంకను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మొత్తం 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి విజేతగా ఆవిర్భవించింది.
2015 మార్చి 29వ తేదీన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 45 ఓవర్లలో 183 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 33.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 186 పరుగులు చేసింది.
ఈ రెండు టోర్నమెంట్లకు మరో సారూప్యత కూడా ఉంది. తోటి నిర్వాహక జట్టే రన్నరప్గా నిలవడం విశేషం. 2011లో శ్రీలంక, 2015లో న్యూజిలాండ్ రన్నరప్గా నిలిచాయి. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే- ఈ సారి ప్రపంచకప్ విజేతగా ఆతిథ్య జట్టు ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయనే అనుకోవచ్చు. దీనికితోడు- ప్రపంచకప్ టోర్నమెంట్కు ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లండ్ జట్టు జోరు మీదుంది.
బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఏ రేంజ్లో ఆడిందో చూశాం. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో ఆస్ట్రేలియాపై ఆధిపత్యాన్ని చెలాయించింది. ఇంగ్లండ్ బౌలర్లు సంధించిన బంతులకు ఆసీస్ బ్యాట్స్మెన్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. అలాగే- ఆస్ట్రేలియా బౌలింగ్ తురుపుముక్కలుగా భావించే మిఛెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్టాయినిస్ వంటి బౌలర్ల స్థాయి ఏమిటో చూపించారు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు. ఇదే ఊపును ఫైనల్ మ్యాచ్లో కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.