లీడ్స్: హెడింగ్లీ టెస్ట్లో భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మన్ డేవిడ్ మలాన్ కొనియాడాడు. చురకత్తిలాంటి బంతులతో తమకెన్నో ప్రశ్నలు సంధించారని తెలిపాడు. కాకపోతే వారికి పిచ్ నుంచి సరైన సహకారం అందలేదన్నాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత డేవిడ్ మలాన్ మీడియాతో మాట్లాడుతూ.. భారత బౌలింగ్ను ప్రశంసించాడు.
'టీమిండియా బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేశారని చెప్పలేను. ఎందుకంటే వారెంతో క్రమశిక్షణగా బంతులు విసిరారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో మాకు అనేక ప్రశ్నలు సంధించారు. బహుశా వారికి వికెట్ నుంచి పూర్తి సహకారం లభించలేదనుకుంటా. భారత్ బ్యాటింగ్ చేసినప్పటి పిచ్కు తాము ఆడే సమయానికి చాలా మారింది.' అని డేవిడ్ మలాన్ చెప్పుకొచ్చాడు.
తమ కెప్టెన్ జోరూట్పై కూడా మలాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. మరో ఎండ్ నుంచి అతని బ్యాటింగ్ను ఆస్వాదించానని తెలిపాడు. 'జోరూట్ ఎప్పుడూ పరుగులు చేస్తూనే ఉంటాడు. అతను చాలా ఈజీగా, వేగంగా పరుగులు చేయడం బాగుంది. ఈ సిరీస్లో మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. పూర్తి ఘనత అంతా అతనికే దక్కుతుంది. అతని ఫుట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. బంతి పొజిషన్ గుర్తించి చక్కగా ఆడతాడు. చాలామంది కన్నా బంతిని ఆలస్యంగా ఆడతాడు. అందుకే అతనికి ఏదైనా చెత్త బంతి దొరికిందంటే చీల్చి చెండాడుతాడు. మరో ఎండ్ నుంచి అతని బ్యాటింగ్ చూడటం ముచ్చటేస్తుంది' అని మలన్ అన్నాడు.
మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ మలాన్.. తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. సాధారణంగా దూకుడుగా ఆడే మలాన్ తొలి ఇన్నింగ్స్లో 70 పరుగులు చేశాడు. కెప్టెన్ జో రూట్తో కలిసి మూడో వికెట్కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో చెత్త బ్యాటింగ్తో టీమిండియా 78 పరుగులకే కుప్పకూలగా.. ఇంగ్లండ్ మాత్రం దుమ్ము రేపింది. వాళ్ల ఆటతీరు బంతి నుంచి బ్యాట్కు బదిలీ అయింది తప్ప ఆడిన తీరు, క్రీజులో జోరు ఏమాత్రం తగ్గలేదు. పరుగుల హోరు ఆగలేదు. బ్యాటింగ్ వరుసలో టాపార్డర్ 'టాప్' ప్రదర్శన చేసింది.
కెప్టెన్ జో రూట్ (165 బంతుల్లో 14 ఫోర్లతో 121) మరో శతకంతో చెలరేగగా, డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 11 ఫోర్లతో 70) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో నిలవగా, ఓవర్టన్ (24 బ్యాటింగ్), రాబిన్సన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. మూడో రోజు ఆట ముందు మైదానాన్ని మబ్బుల కమ్మేసాయి. దాంతో మైదానాన్ని కవర్లతో కప్పేసారు. వాతావరణ శాఖ వర్షం లేదని చెప్పినటప్పటికీ.. పరిస్థితులు మాత్రం వర్షం వచ్చేలా తలపిస్తున్నాయి.