వార్నర్కు షాక్
భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బాదిన బంతిని అందుకునే క్రమంలో వార్నర్ డైవ్ చేయగా.. అతని గజ్జలో గాయమైంది. వెంటనే గ్రౌండ్ వీడిన వార్నర్.. మళ్లీ మైదానంలోకి రాలేదు. ఆ తర్వాత చివరి వన్డేతో పాటు.. మూడు టీ20ల సిరీస్కి దూరమయ్యాడు. టెస్ట్ సిరీస్ సమయానికల్లా కోలుకుందనుకున్నా.. అది జరగలేదు. తొలి టెస్టుకీ దూరమయ్యాడు. ఇప్పుడు రెండో టెస్టు కూడా ఆడడం లేదు. వార్నర్ పూర్తిగా కోలుకోవడానికి మరికాస్త సమయం పడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
అబాట్ కూడా ఔట్
పేసర్ సీన్ అబాట్ కూడా బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వార్నర్, అబాట్ సిడ్నీలో ఫిట్నెస్ మెరుగు కోసం సాధన చేశారు. అబాట్ గాయం నుంచి కోలుకున్నాడు. కానీ సిడ్నీ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జట్టుకు దూరం కావాల్సివచ్చింది. కరోనా నిబంధనల కారణంగానే ఇద్దరికీ జట్టులో చోటు దక్కలేదు. రెండో టెస్ట్ కోసం ఆసీస్ జట్టులో ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉండవని సీఏ పేర్కొంది. మంచి ఫామ్లో ఉన్న వార్నర్ దూరమవడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
హాట్స్పాట్లో లేనప్పటికీ
'డేవిడ్ వార్నర్, సీన్ అబాట్ సిడ్నీలో బయోసెక్యూర్ వెలుపల ఫిట్నెస్ను మెరుగుపర్చుకున్నారు. న్యూసౌత్ వెల్స్లోని హాట్స్పాట్లో వారిద్దరు లేనప్పటికీ .. బాక్సింగ్ డే టెస్టు నాటికి జట్టులో చేరేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ నిబంధనలు అనుమతించవు. అందుకే రెండో టెస్టులో వారు ఆడడం లేదు' అని సీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో వార్నర్ లేకపోవడం ఆసీస్కు ప్రతికూలాంశమే. వార్నర్ గైర్హాజరీతో జో బర్న్స్, మాథ్యూ వేడ్ రెండో టెస్టుకూ ఓపెనర్లగా రానున్నారు.
ఓపెనర్లపై ఆసీస్ నమ్మకం
అడిలైడ్ టెస్టులో ఓపెనర్లుగా ఆడిన మాథ్యూ వెడ్, జో బర్న్స్.. తొలి ఇన్నింగ్స్లో 8, 8 పరుగులకే ఔట్ అయి నిరాశపరిచారు. ఒకే తరహాలో ఇద్దరూ ఔట్ అవడంతో ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం దక్కలేదు. అయితే రెండో ఇన్నింగ్స్లో 33, 51 పరుగులతో టచ్లోకి వచ్చారు. దీంతో ఆసీస్ ఈ ఇద్దరిపై నమ్మకం ఉంచింది. బాక్సింగ్డే టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన ఆటగాడికి ప్రతిష్ఠాత్మక 'జానీ ముల్లఘ్' పతకాన్ని బహుకరిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.