బలమైన జట్టును ఎంచుకున్నా
తాజాగా డానిష్ కనేరియా మాట్లాడుతూ... 'టెస్టు చాంపియన్షిప్, ఇంగ్లండ్ సిరీస్ కోసం టీమిండియా బలమైన జట్టును ఎన్నుకుంది. జట్టు చాలా బాగుంది. అయితే ఒక్క మణికట్టు స్పిన్నర్ను కూడా ఎన్నుకోలేదు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో నలుగురు స్పిన్నర్లు జట్టులో ఉన్నా.. వారంతా ఫింగర్ స్పిన్నర్లు. ఒక లెగ్ స్పిన్నర్ కూడా లేడు. ఇది కచ్చితంగా కోహ్లీసేనకు పెద్ద లోటనే చెప్పాలి. ఎందుకంటే లెగ్ బ్రేక్ బౌలర్లకు ఇంగ్లండ్ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి' అని అన్నాడు. కనేరియా ఇంగ్లీష్ కౌంటీల్లో ఎసెక్స్కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
టీమిండియాకు కచ్చితంగా తెలుస్తుంది
'నేను ఇంగ్లండ్లో ఎనిమిది సంవత్సరాల కౌంటీ క్రికెట్ ఆడాను. వివిధ పరిస్థితులలో ఆడడంతో ఎంతో అనుభవం వచ్చింది. సీజన్ ప్రారంభమైనప్పుడు ఒకలా, టోర్నీ సాగుతున్నా కొద్ది మరోలా పిచ్లు ఉంటాయి. అక్కడ మంచు ప్రభావం కూడా ఉంటుంది. సీమ్ పరిస్థితులు ఉన్నచోట లెగ్ స్పిన్నర్ జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాడు. అందుకే నేను కౌంటీ క్రికెట్ ఆడినప్పుడు విజయవంతం అయ్యా. అక్కడి పరిస్థితులలో ఫింగర్ స్పిన్నర్ కన్నా.. మణికట్టు స్పిన్నర్ జట్టుపై ప్రభావం చూపుతాడు. అందుకే లెగ్ స్పిన్నర్ లేని లోటు టీమిండియాకు కచ్చితంగా తెలుస్తుంది' అని డానిష్ కనేరియా తెలిపాడు.
India vs Sri Lanka: లంక టూర్ నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్.. ధావన్కు లైన్ క్లియర్! ఇదే మొదటిసారి!
రాహుల్ చహర్ ఉన్నా బాగుండేది:
టీమిండియా, ముంబై ఇండియన్స్ జట్లకు ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న స్పిన్నర్ రాహుల్ చహర్ జట్టులో ఉండిఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా. చహర్ ఎత్తు, అతను బంతిని విడిచే విధానం టీమిండియాకు కలిసొచ్చేదన్నాడు.
ఇష్ సోధి, ఆడమ్ జాంపాలా చహర్ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేవాడన్నాడు. చహర్ టెస్ట్ క్రికెట్ ఆడగలడని కనేరియా చెప్పుకొచ్చాడు. 2000లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది. ఆపై స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి జట్టుకు దూరమయ్యాడు.
ఆకాశ్ చోప్రా కూడా
జట్టులో ఒక్క మణికట్టు స్పిన్నర్ లేకపోవడం తనను ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా టీజగా అన్నాడు. 'ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ వారంతా ఫింగర్ స్పిన్నర్లు. మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్లో ఇబ్బందిపడే ప్రత్యర్థి ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ను ఎందుకు తీసుకోకూడదు. బీసీసీఐ సెలెక్టర్లు ఓసారి ఆలోచించండి' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.