బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ చేరింది. ఇంగ్లండ్తో శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బౌలింగ్లో స్నేహ్ రాణా (2/28) సత్తా చాటడంతో భారత చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. మంధానకు తోడుగా జెమీమా రోడ్రిగ్స్(31 బంతుల్లో 7 ఫోర్లతో 44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ (2/22) రెండు వికెట్లు తీయగా.. నాట్ సివర్(1/26), కాథరిన్ బ్రంట్ (1/30) చెరొక వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. డానియల్ వ్యాట్(27 బంతుల్లో 6 ఫోర్లతో 35), నాట్ సివర్(43 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 41), అమీ జోన్స్(24 బంతుల్లో 3 ఫోర్లతో 31) రాణించినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో ఒత్తిడికి గురైన ఇంగ్లండ్ బ్యాటర్లు అనవసర పరుగులకు ప్రయత్నించి రనౌటయ్యారు. క్రీజులో సెట్ అయిన నాట్ సివర్, అమీ జోన్స్ రనౌటవ్వడం ఆ జట్టు కొంపముంచింది. ముఖ్యంగా స్నేహ్ రాణా వేసిన 18వ ఓవర్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.
చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్లో స్నేహ్ రాణా మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. అంతేకాకుండా అమీ జోన్స్ రనౌట్ అయింది. పూజా వస్త్రాకర్ వేసిన 19వ ఓవర్లో సివర్ సిక్సర్ బాదడంతో పాటు లెగ్ బై రూపంలో బౌండరీ రావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే ఆమె కూడా రనౌటవ్వడంతో మ్యాచ్ భారత వైపు మళ్లీంది. చివరి ఓవర్లో రాణా ఓ వికెట్ తీసి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి మహిళల క్రికెట్కు అవకాశమివ్వగా.. ఫస్ట్ టైమ్ భారత్ ఫైనల్ చేరడం గమనార్హం. ఆదివారం టైటిల్ ఫైట్ జరగనుంది.