భారత్ బలం ఎవరంటే..?
భారత్ జట్టు సెమీస్కు చేరడానికి ప్రధాన కారణం స్వింగ్ క్వీన్ రేణుకా సింగ్. వరుసగా 3 మ్యాచ్ల్లో 4 ఎకానమీతో 9 వికెట్లు తీసిన ఆమె ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించింది. ఆస్ట్రేలియాపై నిప్పులు చెరిగిన రేణూ వారి టాప్ఆర్డర్ను పవర్ప్లే లోనే పెవిలియన్కు పంపింది.
ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో బార్బడోస్ బ్యాటర్లను బెంబేలెత్తించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. పవర్ప్లే ఓవర్లలో ఇన్స్వింగ్ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో రేణూ ఎక్స్పర్ట్. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు పెద్దగా ఫామ్లో లేరు. దీంతో రేణుకా పదునైన బంతులతో వారిని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది.
బౌలింగ్లో టీమిండియా అతిపెద్ద బలం రేణుకా సింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమెకు తోడు దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్ కూడా ఫామ్లోనే ఉన్నారు. వీళ్లంతా సమష్టిగా రాణిస్తే ఇంగ్లండ్ బ్యాటర్లను కష్టపెట్టవచ్చు.
బలహీనంగా బ్యాటింగ్..
భారత్ బ్యాటింగ్లో మాత్రం నిలకడలేమి కనిపిస్తోంది. తొలి మ్యాచ్లో అర్ధశతకం చేసిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బార్బడోస్పై డకౌట్ అయింది. పాక్పై 63 పరుగులతో రాణించిన స్మృతి మంధాన, బార్బడోస్పై కీలకపోరులో ఆరంభంలోనే పెవిలియన్ చేరింది. జెమిమా రోడ్రిగ్స్ సైతం వీరిలానే బార్బడోస్పై అర్ధశతకం సాధించినా.. ఆసీస్పై విఫలమైంది.
ఈ ముగ్గురు స్టార్ బ్యాటర్లు ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్లో రాణించారు. అయితే, సెమీస్ లాంటి కీలక మ్యాచ్లో సమష్టిగా ఆడితేనే భారీ స్కోర్ సాధ్యమవుతోంది. యువ ఓపెనర్ షెపాలీ వర్మ 3 మ్యాచ్ల్లో 157.35 స్ట్రెక్రేట్తో 107 పరుగులు సాధించి టీమిండియా టాప్స్కోరర్గా నిలిచింది. ఆమె పవర్ప్లేలో ధాటిగా ఆడటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్లో భారత జట్టు బలం ఈ నలుగురే. వీరు ఇంగ్లండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపై టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఇంగ్లండ్ ప్రధాన బలం అదే..
సొంత గడ్డపై మ్యాచ్లు జరుగుతుండటం ఇంగ్లండ్కు అతిపెద్ద బలం. శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఇలా ప్రత్యర్థి ఎవరైనా ఇంగ్లండ్దే ఆధిపత్యం. లీగ్దశలో ఈ మూడు జట్లపై అలవోకగా నెగ్గిన ఇంగ్లండ్.. ఇప్పుడు భారత్కు సవాల్ విసురుతోంది. ఇంగ్లండ్ జట్టు బౌలర్లు కేథరిన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెడుతున్నారు.
మరి వీరిని భారత్ బ్యాటర్లు ఎలా ఆడుతారో చుడాలి. ఇంగ్లండ్ జట్టు లీగ్దశలో బౌలింగ్తోనే మ్యాచ్లను గెలిచేసింది. బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని నెమ్మదిగా ఛేదించేవారు. అయితే, ఇంగ్లండ్ బ్యాటర్ ఆలిస్ క్యాప్సే మాత్రం ప్రతి మ్యాచ్లోనూ రాణించింది. 3 మ్యాచ్ల్లో (44,50,23) మొత్తం 117 పరుగులు చేసి టోర్నీలో రెండో టాప్స్కోరర్గా ఉంది.
ఇంగ్లండ్ ఓపెనర్లు విఫలం అయినప్పటికీ వన్డౌన్లో క్యాప్సే అదరగొడుతుంది. ఈ క్రమంలోనే టీమిండియా ఈమెను నిలువరించకపోతే మ్యాచ్ చేజారే అవకాశం ఉంది. కెప్టెన్ నటాలీ స్కివర్ మూడు మ్యాచ్ల్లో కలిపి 36 పరుగులే చేసింది. కీలక మ్యాచ్లో ఆమె ఫామ్లోకి వస్తే భారత్కు ప్రమాదమే.
తుదిజట్లు (అంచనా)
భారత్: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్
ఇంగ్లండ్: డానియెల్ వ్యాట్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, నటాలీ స్కివర్ (కెప్టెన్), అమీ జోన్స్ (వికెట్ కీపర్), మైయా బౌచియర్, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఫ్రెయా కెంప్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్