కింగ్స్టన్: కరోనాతో వచ్చిన సుదీర్ఘ విరామం తనకు కలిసొచ్చిందని, మరింత సన్నదమయ్యేందుకు ఉపయోగపడిందని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ తెలిపాడు. క్రికెటర్గా తన కథ ముగియలేదని అప్కమింగ్ కరేబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2020 సీజన్లో సత్తాచాటి అతి త్వరలో విండీస్ జట్టులో చోటు దక్కించుకుంటానని ఈ వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇక 2016 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరి సారిగా ఆడిన సామీ.. 2021 ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా సిద్దమవుతున్నాడు. మరో మూడు రోజుల్లో సీపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సెయింట్ లూసియా సారథిగా క్రిక్బజ్తో మాట్లాడుతూ..ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఈ లాక్డౌన్ సమయంలో నాకు నేను ఆత్మపరిశీలన చేసుకున్నా. ఓ ఆటగాడిగా మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నించా. నేను ఇంకా క్రికెట్కు గుడ్బై చెప్పలేదు. ప్రస్తుత సీపీఎల్లో సెయింట్ లూసియా జట్టు కోసం నేను చేయాల్సింది జాగ్రత్తగా చేస్తే సెలెక్టర్ల దృష్టిలో పడుతా. వ్యక్తిగతంగా రాణిస్తూ జట్టును ప్లే ఆఫ్స్కు తీసుకుపోతే అవకాశం అదే వస్తుంది. అందుకే ఈ సీజన్లో ఎలాగైనా రాణించాలనే కసితో ఉన్నా. వ్యక్తిగతంగా రాణించడం.. జట్టును ముందుకు తీసుకెళ్లడమే నా ప్రస్తుత టార్గెట్'అని సామీ స్పష్టం చేశాడు.
ఇక సామీ సారథ్యంలోనే వెస్టిండీస్ జట్టు 2016 టీ20 ప్రపంచకప్ గెలిచింది. ఇక అదే ఏడాది విండీస్ జట్టుకు దూరమైన సామీ మళ్లీ టీమ్లో అవకాశం దక్కించుకోలేకపోయాడు. 2017లో పాకిస్థాన్తో తలపడిన వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ విండీస్ జట్టులోకి రాలేకపోయాడు. ఓవైపు గాయాలు.. మరోవైపు విండీస్ క్రికెట్ బోర్డు విబేధాలతో పునరాగమనం చేయలేకపోయాడు. ఇక ఆగస్టు 18న సీపీఎల్ 2020కి తెరలేవబోతున్న విషయం తెలిసిందే.