ఏం బాధలేదు:
తాజాగా ఐపీఎల్ వేలంలో తనను ఎవరు కొనుగోలు చేయకపోవడంపై చతేశ్వర్ పుజారా మరోసారి స్పందించాడు. 'నేను ఐపీఎల్ 2020 వేలంలో అమ్ముడుపోనందుకు ఏం బాధలేదు. ఐపీఎల్కు ఆడలేకపోతున్నా అనే ఫీలింగ్ కూడా లేదు. ఎందుకంటే టీ20ల్లో నాకంటే బాగా ఆడేవాళ్లు చాలా మందే ఉన్నారు. వరల్డ్ క్లాస్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్న హషీమ్ ఆమ్లా కూడా అమ్ముడుపోని ఆటగాడిగానే మిగిలాడు. ఆమ్లాలా ఇంకా ఎందరో ఉన్నారు. అందులో నేను ఒకడిని. మేము ఐపీఎల్లో ఆడడం లేదన్న ఈగో ఫీలింగ్ లేదు. నా ప్రదర్శనతో నేను సంతోషంగా ఉన్నా' అని పుజారా తెలిపాడు.
కొంచెం నిరుత్సాహంగానే ఉన్నా:
'ఇప్పటికి అవకాశమొస్తే అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ నన్ను ఒక టెస్టు ప్లేయర్గా మాత్రమే గుర్తించారు. దానికి నేను కూడా ఏం చేయలేను. టీమిండియాలో నాతో పాటు ఆడే ఆటగాళ్లు ప్రతీసారి ఐపీఎల్లో బిజీగా ఉంటే బీసీసీఐ అనుమతితో నేను మాత్రం ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ క్రికెట్లో పాల్గొనేవాడిని. కరోనా కారణంగా ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. కౌంటీలో ఆడడం లేదని కొంచెం నిరుత్సాహంగానే ఉన్నా' అని టెస్టు ఆటగాడు అన్నాడు.
దేశం కోసం సాధించే విజయంలో ఆనందం:
'టీమిండియా తరపున టెస్టుల్లో జట్టుకు ఎన్నో విజయాలు సాధించి పెట్టా. అశేషమైన భారత అభిమానుల మద్దతుతో మ్యాచ్లు గెలవడం కన్నా ఇంకా గొప్ప అనుభూతి ఏం ఉంటుంది చెప్పండి. టెస్టుల ద్వారా ఇప్పటికే చాలాసార్లు చూశా. ఐపీఎల్లో సాధించే విజయం కన్నా దేశం కోసం సాధించే విజయంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు' అని చతేశ్వర్ పుజారా చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేసిన పుజారా 77 టెస్టులాడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మొత్తం 18 సెంచరీలు ఉన్నాయి.
521 పరుగులతో టాప్ స్కోరర్గా:
భారత్ తరఫున కేవలం టెస్టులు మాత్రమే చతేశ్వర్ పుజారా ఆడుతున్నాడు. టీమిండియా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ని ఆడబోతోంది. దీంతో ఇప్పటి నుంచే పుజారా ప్రాక్టీస్ మొదలెట్టాడు. డిసెంబరు 3 నుంచి బ్రిస్బేన్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. 2018-19 పర్యటనలో కోహ్లీసేన 2-1తో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో పుజారా అద్భుతంగా ఆడాడు. 74.42 యావరేజితో 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.