
రూ.1800 బకాయి:
ఇక ఇటీవల జేఎస్సీఏ విడుదల చేసిన వార్షిక రిపోర్ట్లో ఎంఎస్ ధోనీ రూ.1800 బకాయిలు పడినట్లు చూపించారు. అసోసియేషన్ ప్రకటనతో ఒక్కసారిగా జంషెడ్పూర్లో గందరగోళం చెలరేగింది. ఈ విషయంపై మాజీ క్రికెటర్, సామాజిక కార్యకర్త శేష్నాథ్ పాఠక్.. జేఎస్సీఏపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.వందల కోట్లు సంపాదించిన మహీకి కేవలం రూ.1800 చెల్లించలేకపోవడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ధోనీ బకాయిలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో.. జేఎస్సీఏ అధికారులు ఓ వివరణ ఇచ్చారు.

బకాయిపై అధికారికంగా సమాచారం:
మెంబర్షిప్ ఫీజు కింద రూ.10,000 చెక్ ఇచ్చిన ఎంఎస్ ధోనీ.. దానికి జీఎస్టీ రూ.1800 చెల్లించలేదని జేఎస్సీఏ అధికారి ఒకరు తెలిపారు. ధోనీ నుంచి చెక్ తీసుకున్న అధికారి కూడా జీఎస్టీ విషయాన్ని అతనికి చెప్పకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. ఐపీఎల్ 2020 సీజన్లో ఆడేందుకు యూఏఈలో ఉన్న ధోనీకి రూ.1800 బకాయిపై అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు సదురు అధికారి స్పష్టం చేశాడు.

డ్రాఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నించగా:
తాజాగా శేష్నాథ్ పాఠక్ సారథ్యంలోని కొంతమంది విద్యార్థులు, ఎంఎస్ ధోనీ అభిమానులు చందాలు సేకరించారు. సేకరించిన సొమ్మును డ్రాఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నించగా.. అసోసియేషన్ (జేఎస్సీఏ) అంగీకరించలేదు. కొంతమంది ఆదేశాలతోనే జేఎస్సీఏ తామిచ్చిన డ్రాఫ్ట్ను తీసుకోవడానికి నిరాకరించిందని, డ్రాఫ్ట్ను పోస్టు ద్వారా పంపాలని సూచించారని పాఠక్ తెలిపారు. అసోసియేషన్కు ధోనీ బాకీపడినట్టు మీడియా ద్వారా తెలిసిందని, అందుకనే తమవంతుగా ఆ సొమ్ము సేకరించాలని నిర్ణయించుకున్నామని పాఠక్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు కూడా కొంత మొత్తాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

ఎటువంటి అనుమతి లేదు:
జేఎస్సీఏ కార్యదర్శి సంజయ్ సహాయ్ మాట్లాడుతూ... 'ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అది వారిష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే డబ్బులు కానీ, ఫీజు కానీ మరేదైనా ఇతరుల పేరుపై చెల్లించాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. బకాయి సొమ్ము చెల్లించమని ఎంఎస్ ధోనీ కనుక వీరికి చెప్పి ఉంటే.. నా ఆమోదంతో పనిలేదు. ధోనీ రుణపడిన సొమ్మును చెల్లించేందుకు ఆయన నుంచి వీరికి ఎటువంటి అనుమతి లేదు. అందుకనే ఆ డ్రాఫ్ట్ను తీసుకునేందుకు నిరాకరించాం' అని చెప్పారు.


Click it and Unblock the Notifications

మరోసారి మన్కడింగ్.. ఈసారి దావ్లత్ జద్రాన్ వంతు!!










