|
కీలక పీటర్సన్ క్యాచ్ నేలపాలు..
నాలుగో రోజు ఆటలో సౌతాఫ్రికా కీలక బ్యాట్స్మన్ కీగన్ పీటర్సన్ ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్ ఫీల్డర్గా ఉన్న పుజారా నేలపాలు చేశాడు. 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బుమ్రా బౌలింగ్లో పీటర్సన్ ఇచ్చిన క్యాచ్ను ఫస్ట్ స్లిప్ ఫీల్డర్గా ఉన్న పుజారా అందుకోలేకపోయాడు. బుమ్రా వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను పీటర్సన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి పుజారా వైపు దూసుకెళ్లింది. అయితే పుజారా అప్రమత్తంగా లేకపోవడంతో బంతి నేరుగా అతని చెస్ట్ను తాకింది. దాంతో బంగారం లాంటి అవకాశం చేజారింది. మూడో రోజు ఆటలో డీన్ ఎల్గర్ ఇచ్చిన క్యాచ్ను కూడా పుజారా నేలపాలు చేశాడు.
|
పుజారా క్యాచ్ పట్టి ఉంటే..
పీటర్సన్ క్యాచ్ పట్టి ఉంటే.. టీమిండియా మ్యాచ్పై పట్టు సాధించేది. ఈ అవకాశాన్ని అందుకున్న పీటర్సన్ 82 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ అతన్ని ఔట్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పీటర్సన్ విలువైన పరుగులు చేయడంతో ఒత్తిడంతా భారత్పై నెలకొంది. క్రీజులోకి వచ్చిన బవుమా(12 బ్యాటింగ్), డస్సెన్(21) స్వేచ్చగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విజయానికి 41 పరుగుల దూరంలో ఉంది.
|
వాడు స్టన్నర్ అయితే..
ఇక పుజారా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను కీగన్ పీటర్సన్ సూపర్ మ్యాన్లా అందుకొని అందర్నీ ఔరా అనిపిస్తే.. పీటర్సన్ ఇచ్చిన సునాయస క్యాచ్ పుజారా నేలపాలు చేశాడని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. పీటర్సన్ స్టన్నర్ అయితే పుజారా బ్లండర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్యాచ్తో పాటు తన కెరీర్కు ముంగిపు పలికాడని మండిపడుతున్నారు. చాలా సార్లు పుజారా స్లిప్లో క్యాచ్లు నేలపాలు చేశాడని, తాను నిల్చున్న స్థానం నుంచి జరగకపోవడం వల్లే ఈ తప్పిదాలు చేస్తున్నాడని ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు.
ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ..
సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ.. పుజారా సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 50వ ఓవర్ ఐదో బంతిని ఆఫ్ స్టంప్కి టెంబా బవుమా కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి ఫస్ట్ స్లిప్లోకి దూసుకెళ్లగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పుజారా క్యాచ్ను నేలపాలు చేశాడు. పుజారా చేయి జారిన బంతి పక్కకి దొర్లుకుంటూ వెళ్లి రిషబ్ పంత్ వెనుక వైపు ఉంచిన హెల్మెట్లను తాకింది. దాంతో ఫీల్డ్ అంపైర్ 5 పరుగుల పెనాల్టీని భారత్కి విధించారు. ఈ క్రమంలోనే పుజారా వల్ల జట్టుకు అన్నివిధాల నష్టమే తప్పా ఒరిగిందే లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అతన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.