ముంబై : టీమిండియా సెలెక్షన్ కమిటీ నూతన సభ్యులను ఎంపిక చేసేందుకు బీసీసీఐ గైడ్లైన్స్ కోసం వేచి చూస్తున్నామని క్రికెట్ సలహా కమిటీ మెంబర్ మదన్లాల్ తెలిపారు. సెలెక్టర్ల ఎంపికకు సంబంధించిన నిబంధనలపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఇక ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడా పదవీ కాలం ముగియడంతో బీసీసీఐ కొత్తవారి కోసం నియమాక ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే.
కొత్త సెలెక్టర్లను ఎంపిక చేసేందుకు మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్లతో కూడిన క్రికెట్ అడ్వజైరీ కమిటీ(సీఏసీ)ని కూడా నియమించింది. ఇక సీఏసీ సభ్యుడిగా నియమించిన తర్వాత బీసీసీఐ అధికారులతో మాట్లాడినట్లు మదన్లాల్ తెలిపారు. అయితే ఖాళీగా ఉన్న రెండు పోస్ట్ల నియామకం గురించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదన్నారు. ఇక భారత్ ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను నియమిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు.
'క్రికెట్ సలహా కమిటీ సభ్యుడిగా నన్ను నియమించగానే బీసీసీఐతో మాట్లాడా. నేషనల్ సెలక్టర్లను ఎంపిక చేసేందుకు పాటించాల్సిన గైడ్లైన్స్ ఇంకా రావాల్సి ఉంది. వెస్ట్జోన్ నుంచి జతిన్ పరాంజపె ఉన్నారు కాబట్టి అగార్కర్ను ఎంపిక చేయాలా వద్దా అన్నది ఇప్పుడే చెప్పలేను. మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే ఏంటనదే చెప్పగలను.'అని మదన్లాల్ చెప్పుకొచ్చారు.
పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనపై మదన్లాల్ సూటిగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనపై త్వరగా తేల్చేయాలి. లేదంటే క్రికెట్ పాలనలో ఇబ్బందులు తప్పవు. నేను చిన్నారులకు కోచింగ్ ఇవ్వడం మానలేనని బోర్డుకు స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే ప్రస్తుతం నాకు, నా కుటుంబానికి అన్నం పెడుతోంది ఆ కోచింగే. నాకు విరుద్ధ ప్రయోజనాలు లేవని నేనెంతో నిజాయతీగా డిక్లరేషన్ ఇచ్చాను' అని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా సిరీస్కు జట్టును కొత్త సెలక్షన్ కమిటీనే ఎంపిక చేస్తుందని గతంలో గంగూలీ వెల్లడించిన సంగతి తెలిసిందే.