హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో ఆడి ఇంగ్లాండ్ పరువు కాపాడాడు బట్లర్. ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరపున ఆడుతోన్న బట్లర్ లార్డ్స్ వేదికగా పాకిస్థాన్తో జరుగుతోన్న మొదటి టెస్టులో వీరోచిత పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఏడాదిన్నర తర్వాత టెస్టుల్లోకి పునరాగమనం చేసిన బట్లర్ (66 నాటౌట్) తొలి టెస్టు ఆడుతున్న డొమినిక్ బెస్ (55 నాటౌట్)తో కలిసి తమ జట్టును దారుణ పరాభవాన్ని తప్పించాడు. వీరిద్దరి అద్భుత పోరాటం కారణంగా మూడో రోజే టెస్టును కోల్పోయే ప్రమాదం నుంచి ఇంగ్లాండ్ బయటపడింది.
గత 106 ఏళ్లలో ఏ పర్యాటక జట్టు కూడా మూడు రోజుల్లోనే లార్డ్స్ టెస్టులో గెలవలేదు. హాఫ్ సెంచరీ చేసిన రూట్ (68) ఔటవడంతో ఇంగ్లాండ్ ఓ దశలో 110/6తో పతనం దిశగా సాగింది. మరి కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందేమో అనిపించింది. అరుదైన రికార్డు పాకిస్థాన్ ఖాతాలో చేరుతుందని భావించారు. కానీ బట్లర్-బెస్ జోడి ఏడో వికెట్కు అజేయంగా 125 పరుగులు జోడించి ఆ గండాన్ని దాటించింది.
బట్లర్-బెస్ జోడీ పోరాటం కారణంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 235/6తో నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టు 56 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకూ లార్డ్స్లో ఇన్నింగ్స్ తేడాతో మూడు టెస్టుల్లో మాత్రమే ఓడింది. బట్లర్ కారణంగా నాలుగోసారి అలాంటి దారుణ పరాభావాన్ని తప్పించుకుంది. ఇంగ్లిష్ జట్టుపై 1987లో మాత్రమే పాకిస్థాన్ ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది.
టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బదులుగా పాకిస్థాన్ 363 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్లో కుక్ (70) మాత్రమే హాఫ్ సెంచరీ సాధించాడు. బట్లర్-బెస్ జోడి నాలుగో రోజు కూడా క్రీజులో నిలబడగలిగితే.. ఇంగ్లాండ్ ఓటమి ప్రమాదం నుంచి తప్పుకోగలుగుతుంది.