న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ అన్నాడు. కివీస్ గన్ తీసుకుంది కానీ.. బుల్లెట్లు పేల్చలేదని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో గత ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఓడి మరోసారి ప్రపంచకప్ టైటిల్ను చేజార్చుకుంది. ఈ క్రమంలోనే ఓటమిపై స్పందించిన మెక్కల్లమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నేను మార్టిన్ గప్టిల్ నుంచి మరింత ఇన్నింగ్స్ ఆశించాను. అతను 35 బంతుల్లో 28 పరుగులే చేశాడు. ఆ పద్దతి అస్సలు బాగోలేదు. అయితే, అంతకు ముందు 15 బంతుల్లో 16 పరుగులు చేశాడు. తర్వాతి 20 బంతుల్లో 12 రన్స్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లోనే దూకుండా ఆడాలి. అయితే అక్కడే న్యూజిలాండ్ వెనుకబడిపోయింది. కీలక సమయంలో పరుగులు చేయలేకపోయింది. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా సరైన ప్రదర్శన చేయలేకపోయారు.'అని మెక్ కల్లమ్ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడింది న్యూజిలాండ్ జట్టేనా? అంటూ ఆ టీమ్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశాడు. తానే న్యూజిలాండ్ అభిమానినైతే.. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు. 'టీ20 ప్రపంచకప్లో భారత్ తర్వాత న్యూజిలాండే నా ఫేవరేట్ టీమ్. కానీ ఫైనల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. బ్యాటింగ్లో అద్భుతంగా రాణించి 172/4 పరుగులు చేసిన ఆ జట్టు.. బౌలింగ్లో మాత్రం విఫలమైంది. భీకరమైన బౌలింగ్ లైనప్, సూపర్ ఫీల్డింగ్ కలిగిన న్యూజిలాండ్కు ఈ స్కోర్ డిఫెండ్ చేయడం కష్టమేమి కాదు. కానీ ఆ జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. సూపర్-12లో భారత్ను, సెమీస్లో ఇంగ్లండ్ను ఓడించిన జట్టులా కనిపించలేదు. అసలు ఆడుతుంది న్యూజిలాండ్ జట్టేనా? అనే సందేహం కలిగింది.
మెగా ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 85) అద్భుతంగా ఆడగా... హాజల్వుడ్ (3/16) బౌలింగ్లో రాణించాడు. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్లతో 53) రెండో వికెట్కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచాడు.