వెల్లింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (కొవిడ్ 19) వైరస్ కారణంగా అన్ని క్రీడా టోర్నీలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడలు తిరిగి ప్రారంభమవుతాయని, అంతకంటే ముందు ప్రజలు సురక్షితంగా ఉండాలని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కలమ్ సూచించాడు. ప్రస్తుత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా.. వైద్య, ఆర్థిక వనరులు అందుకుతగ్గట్టుగానే ఉన్నాయని తెలిపాడు.
'ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితుల చుట్టే నా ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి. సమయానుకూలంగా క్రీడలు మళ్లీ ప్రారంభమవుతాయి. కానీ, ఇప్పుడు ప్రతీఒక్కరూ క్షేమంగా ఉండటమే ముఖ్యం. దీన్ని అధిగమించే మార్గాన్ని కనుగొనాలి. ఇదివరుకెన్నడూ లేనివిధంగా ఆర్థిక, వైద్య అంశాల్లో మన తరానికి సవాల్ ఎదురవుతోంది. అయినా త్వరలోనే మార్గం కనుగొనబడుతోంది'అని మెక్కలమ్ ట్వీట్ చేశాడు.
మరోవైపు కరోనాని కట్టడి చేయడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం బుధవారం అన్ని రకాల స్థానిక క్రికెట్ టోర్నీలను రద్దు చేసింది. అలాగే క్రికెట్ క్లబ్లు, పాఠశాలలను కూడా సీజన్ మొత్తం మూసివేసింది. సోమవారం దేశవాళీ క్రికెట్ ప్లంకెట్ షీల్డ్ టోర్నీని రద్దు చేసింది. విదేశాల నుంచి వచ్చేవారిని 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి స్వదేశానికి చేరిన కివీస్ జట్టు కూడా స్వీయ నిర్బంధంలో ఉండనుంది.