పంత్ ముందకు పంపించడం..
'టీమిండియా నాలుగో ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడింది. కేవలం డ్రా కోసం కష్టపడాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు పంత్ను ముందుగా పంపించాలన్న రహానే నిర్ణయం నిజంగా అద్భుతం. రిషభ్ను ముందు పంపించి ఆటను ముందుకు తీసుకెళ్లాలని రహానే భావించాడు. పంత్ అలాగే చేశాడు. నిర్భయంగా ఆడి టిమ్ పైన్ కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేసుకొనేలా చేశాడు. అందుకే రహానే వ్యూహం గొప్పదని అంటున్నా' అని హడిన్ తెలిపాడు. దూకుడుగా ఆడిన పంత్ 97 పరుగులు చేసి జింక్స్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే.
గాయాలైనా..
' పంత్ తర్వాత విహారి వచ్చాడు. అతనూ పుజారాలాంటి ఆటగాడే. వాళ్ల స్వభావం ఆటను ముగించడం. వారు అచ్చం అలాగే చేశారు. రహానే సారథిగా ఒక్క మ్యాచూ ఓడిపోలేదు. టీమిండియాకు సిడ్నీలో అతను ధైర్యాన్ని నూరిపోశాడు. ఆటగాళ్లు గాయాలపాలైనా పట్టుదలతో ఆడారు. వారిలోని అంకితభావాన్ని ప్రదర్శించారు. వాళ్ల కెప్టెన్ లేడు. ముగ్గురు పేసర్లు మధ్యలోనే వెళ్లిపోయారు. జడేజా వేలు విరిగింది. అయినా వారు నిర్భయంగా క్రికెట్ ఆడారు' అని హడిన్ ప్రశంసించాడు.
అసాధారణ పోరాటం..
407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 98/2తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (118 బంతుల్లో 97; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, చతేశ్వర్ పుజారా (205 బంతుల్లో 77; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.
అనంతరం హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్లో నిలిచి ఆరో వికెట్కు 62 పరుగులు జోడించారు. మూడో టెస్టు డ్రా కావడంతో సిరీస్ 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్ట్ ఆడనుంది.