హైదరాబాద్: క్రికెట్ను మతంలా భావించే భారత్లో మహిళల క్రికెట్పై మాత్రం చిన్న చూపు ఉండేది. కానీ మిథాలీ రాజ్, స్మృతి మంధానా, హర్మన్ ప్రీత్ కౌర్ వంటి స్టార్ ప్లేయర్ల రాకతో మహిళల క్రికెట్పై ఉన్న అభిప్రాయం మారింది. అబ్బాయిలను తలదన్నేలా అమ్మాయిలు చెలరేగుతుండటంతో మహిళల క్రికెట్కు ఆదరణ పెరుగుతోంది. దీనికి నిదర్శనం ఆస్ట్రేలియా మహిళలతో ఆదివారం భారత్ మహిళలు ఆడిన రెండో టీ20. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఈ మ్యాచ్కు విశేష ప్రేక్షాదరణ లభించింది. స్మృతి మంధాన, రిచా ఘోష్ మెరుపులకు ఫిదా అయిన ఫ్యాన్స్.. టీవీలకు అతుక్కుపోయారు.
సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. స్మృతి మంధానా సెన్సేషనల్ బ్యాటింగ్తో భారత్కు చిరస్మరణీయ విజయం దక్కింది. ముంబైలోని డీవై పటేల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 45,238 మంది అభిమానులు హాజరయ్యారు. భారత్లో మహిళల ద్వైపాక్షిక సిరీస్లోని ఓ మ్యాచ్కు ఇంత భారీ సంఖ్యలో జనాలు హాజరవ్వడం ఇదే తొలి సారి. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమైన హాట్ స్టార్లో వీక్షకుల సంఖ్య 1.1 మిలియన్కు చేరింది. భారత మహిళల మ్యాచ్ను హాట్స్టార్ వేదికగా ఇంత మంది చూడటం ఇదే తొలిసారి.
Alyssa Healy said - "What a great advertisement for women's cricket this has been, with 40,000 plus people here tonight".
— CricketMAN2 (@ImTanujSingh) December 11, 2022
మైదానానికి వచ్చిన జనాలను చూసి ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ షాక్కు గురైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈ సిరీస్కు ఇంత ప్రేక్షకాదరణ లభిస్తోందని అస్సలు ఊహించలేదని తెలిపింది. మహిళల క్రికెట్కు ఇంతకంటే గొప్ప అడ్వర్టైజ్మెంట్ ఏం ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరోసారి బెత్ మూనీ(54 బంతుల్లో 13 ఫోర్లతో 82), తహిల మెక్గ్రాత్(51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 70) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్.. స్మృతి మంధాన(49 బంతుల్లో 9 ఫోర్లతో 4 సిక్స్లతో 79), రిచా ఘోష్(13 బంతుల్లో 3 సిక్స్లతో 26 నాటౌట్) సెన్సేషనల్ బ్యాటింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్లో రిచా ఘోష్, స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్తో భారత్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళలు రేణుకా సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో 16 పరుగులకే పరిమితమై ఓటమిపాలయ్యారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టీ20 బుధవారం జరగనుంది.