
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. ఆటగాళ్లంతా వైరస్ బారిన పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇక నిన్న కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తీ, సందీప్ వారియర్, సీఎస్కే కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ డ్రైవర్ కరోనా బారిన పడగా.. నేడు సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు పాజిటీవ్ వచ్చింది. దాంతో ఆయా జట్లన్నీ ఐసోలేషన్లోకి వెళ్లాయి. మ్యాచ్ల నిర్వహణ కష్టంగా మారడంతో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
వరుసగా ఆటగాళ్లంతా వైరస్ బారిన పడుతుండటంతో విదేశీ ఆటగాళ్లంత భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారత విమానాలను రద్దు చేయడంతో పాటు ప్రయాణ ఆంక్షలు విధించడంతో విదేశీ ఆటగాళ్లంతా లీగ్ను వదిలి స్వదేశాలు వెళ్తామని చెప్పడంతో బీసీసీఐ లీగ్ను రద్దు చేసిందని సమాచారం.
ఈ సీజన్ టోర్నమెంట్ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం నిర్ధారించట్లేదు. కరోనా సంక్షోభం ముగిసిన తరువాత.. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడే ఈ టోర్నమెంట్ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాలు వెలువడుతున్నాయి. అయినా అంతర్జాతీయ క్రికెట్ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ సీజన్ సాధ్యం కాకపోవచ్చు. డబ్ల్యూటీసీ చాంపియన్షిప్, వరల్డ్ కప్, ఆసియాకప్ ఇలా అన్ని బీజీ షెడ్యూల్లే ఉన్నాయి.
కాగా ఐపీఎల్ వాయిదా పడటంతో క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురైనప్పటికీ ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.