
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షా తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ను 75 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసం ఐసీసీ అనుమతి పొందేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పాడు. ఈ మేరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్లానింగ్ జాబితాలో ఈ ప్రతిపాదనను చేరుస్తామని జై షా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ ఆటగాళ్లు పాల్గొనే లీగ్ను మరో రెండు వారాలు అదనంగా నిర్వహించాలనేది తమ అభిమతమని చెప్పిన జై షా.. ఇప్పటికిప్పుడు మరిన్ని ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రకారం పది జట్లతోనే లీగ్ నిర్వహిస్తామన్నాడు.
తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడిన జై షా.. వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ గవర్నింగ్ కౌన్సిల్లో ఐపీఎల్ విండోపై పూర్తి క్లారిటీ వస్తుందని పేర్కొన్నాడు. 'ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఐసీసీతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఏడాది ధనాధన్ లీగ్ను రెండున్నర నెలలపాటు నిర్వహించేలా ఐసీసీ క్యాలెండర్లోనూ అవకాశం కల్పిస్తాం. టాప్ ఆటగాళ్లు తప్పకుండా హాజరవుతారు. అదేవిధంగా టీ20 లీగ్ను విస్తరించే క్రమంలో ఆట నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయి నుంచి బలోపేతం అవుతూనే ఉంటాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తాం'అని జై షా పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఐపీఎల్ రెండు నెలలపాటు 74 మ్యాచ్లను నిర్వహించేవారు. ఇక రెండున్నర నెలలపాటు నిర్వహిస్తే మాత్రం మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ భారీ మొత్తంలో ఆదాయం రాబట్టింది. అలాగే 2024-2031 భవిష్యత్ పర్యటనల కార్యాచరణను నిర్దేశించడానికి ఐసీసీ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చే నెలలో సమావేశం కానుంది. ఈ క్రమంలో అనుబంధ దేశాలతోపాటు టాప్ జట్లతో ద్వైపాక్షిక సిరీస్లను ఆడేలా సమగ్రమైన క్యాలెండర్ను రూపొందించడమే తమ లక్ష్యమని జై షా స్పష్టం చేశాడు.
కాగా, ఈ ఏడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెరగడంతో క్యాష్ రిచ్ లీగ్ రెండు నెలల పాటు సాగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022లో మ్యాచ్ల సంఖ్య 74కు పెరగగా.. రానున్న సీజన్లలో ఈ సంఖ్య 94కు పెరిగే అవకాశం ఉంది.