న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన సెలెక్షన్ కమిటీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. 80 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. సెలెక్టర్ పదవి దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 28 చివరి తేదీ కాగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యంతో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీని బీసీసీఐ ఉన్న పళంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రెండు ప్రపంచకప్లు ఆడిన భారత్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
సరైన జట్టును ఎంపిక చేయకపోవడమే దీనికి కారణమని చేతన్ శర్మ కమిటీపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో పదవి కాలం ముగియకుండానే ఈ కమిటీని రద్దూ చేస్తూ రోజర్ బిన్నీ సారథ్యంలోని బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త గైడ్లైన్స్ జారీ చేస్తూ నోటీఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన కమిటీ డిసెంబర్ మధ్యలో బాధ్యతలు స్వీకరించనుంది. కొత్త కమిటీ ఆస్ట్రేలియాతో సిరీస్కు టీమ్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 80 అప్లికేషన్స్ వచ్చాయని, సౌత్ జోన్ నుంచి లక్ష్మన్ శివరామకృష్ణ బలమైన అభ్యర్థని ప్రచారం జరుగుతోంది. కానీ అతనికి అవకాశం దక్కదని విశ్లేషకులు అంటున్నారు.
జూనియర్, సీనియర్ సెలెక్షన్ కమిటీలో ఒకే ప్రాంతానికి చెందనివారు ఉండటాన్ని బీసీసీఐ అనుమతించదని పేర్కొంటున్నారు. గతేడాదే ఎన్ శ్రీనివాసన్ మద్దతుతో లక్ష్మన్ శివరామకృష్ణన్ సెలెక్షన్ కమిటీలో చోటు కోసం ప్రయత్నించినా.. అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అడ్డుకున్నాడు. చేతన్ శర్మకు ఆ బాధ్యతలను అప్పగించాడు. అయితే ఇప్పుడు గంగూలీ శకం ముగియగా.. రోజర్ బిన్నీ చేతుల్లో అధికారం ఉంది. శ్రీనివాసన్కు రోజర్ బిన్నీకి మంచి సంబంధాలున్నాయి.
అజిత్ అగార్కర్ దరఖాస్తు చేస్తే మాత్రం అతనికే చీఫ్ సెలెక్టర్ పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీ20 అనుభవం ఉన్న ఆటగాడిని సెలెక్టర్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాబట్టి అగార్కర్ ఈ పదవికి సెట్ అవుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అగార్కర్ భారత్ తరఫున 4 టీ20లు ఓవరాల్గా 62 మ్యాచ్లు ఆడాడు.