25 శాతం పెరిగిన వ్యూయర్షిప్
ఐపీఎల్ 2020 ద్వారా ఏకంగా 4వేల కోట్ల ఆదాయం తమకు వచ్చినట్లు బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఓ ప్రకటనలో తెలిపారు. టీవీ వ్యూయర్షిప్ కూడా గతేడాదితో పోలిస్తే.. 25 శాతం పెరిగినట్లు ఆయన చెప్పారు. అలాగే గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది దాదాపుగా 35శాతం ఖర్చులను బోర్డు కట్ చేసినట్లు అరుణ్ పేర్కొన్నారు. ఇక ఈ ఐపీఎల్లో భాగంగా 18వందల మందికి 30వేలకు పైగా కరోనా టెస్ట్లు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. అయితే భారత్లో మ్యాచులు నిర్వహించినప్పుడు అయ్యే ఖర్చు కంటే 35 శాతం వ్యయం అధికంగా వచ్చిందట. ఐపీఎల్ 2020కి ఆతిథ్యం ఇచ్చినందుకు గానూ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ)కి బీసీసీఐ రూ.100 కోట్లు చెల్లించింది.
4వేల కోట్ల ఆదాయం వచ్చింది
ఇండియన్ ఎక్స్ప్రెస్తో అరుణ్ ధుమల్ మాట్లాడుతూ... 'గత ఐపీఎల్తో పోలిస్తే ఈసారి బోర్డు దాదాపు 35 శాతం ఖర్చును తగ్గించగలిగింది. కరోనా సమయంలోనూ బీసీసీఐకి రూ .4,000 కోట్ల ఆదాయం వచ్చింది. టీవీ వ్యూయర్షిప్ 25 శాతం పెరిగింది. ముంబై, చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్ను రికార్డు స్థాయిలో వీక్షించారు. ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేసిన వారు లీగ్ ముగిశాక వచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ సీజన్లో ఐపీఎల్ జరగకపోతే.. క్రికెటర్లు ఏడాది కాలాన్ని కోల్పోయేవారు. బీసీసీఐ 30 వేల కోవిడ్ టెస్టులు చేసింది. ఐపీఎల్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం కోసం 1500 మంది పని చేశారు' అని తెలిపారు.
టీ20 ప్రపంచకప్ వాయిదా పడడంతో
కరోనా వైరస్ కారణంగా మార్చిలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 ఏప్రిల్కు వాయిదా పడింది. కానీ కరోనా తగ్గకపోగా.. ఎక్కువవడంతో తర్వాత నిరవధికంగా వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ కష్టమనే భావన వ్యక్తమైంది. అదే జరిగితే వేల కోట్లు నష్టపోతామని బీసీసీఐ భావించింది. ఇక టీ20 ప్రపంచకప్ కూడా వాయిదా పడడం కలిసొచ్చింది. వేదికను భారత్ నుంచి దుబాయ్కు మార్చిన బీసీసీఐ.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు నిర్వహించి సక్సెస్ అయింది. దీంతో బీసీసీఐ, ఈసీబీకి కాసుల పంట కురిసింది. ఐపీఎల్ 2020కి ఆతిథ్యం ఇచ్చినందుకు గానూ ఈసీబీకి బీసీసీఐ రూ.100 కోట్లు చెల్లించింది.
నిబంధనల్లోనూ పలు మార్పులు
ఐపీఎల్-13వ సీజన్ దిగ్విజయంగా ముగియడంతో ఇప్పుడు ఆయా ఫ్రాంచైజీల దృష్టంతా 2021 సీజన్ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే 14వ సీజన్లో భారీ మార్పులే కనిపించబోతున్నాయి. ఇప్పటికే లీగ్లో తొమ్మిదో జట్టును కూడా చేర్చబోతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే మెగా వేలం ఎలాగూ ఉండబోతోంది. చాలా జట్లకు తమ బృందాన్ని మరింత పటిష్టపర్చుకునే దిశగా ఈ వేలం ఉపయోగపడుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా నిబంధనల్లోనూ పలు మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇందులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించాలనే ప్రతిపాదన అతి ముఖ్యం కానుంది.
కోహ్లీ త్వరలోనే ఆ కలను నిజం చేసుకుంటాడు.. బహుశా 2021లో: హర్భజన్