స్టేడియం మొత్తాన్ని వ్యాపారమయంగా
2004లో ఉప్పల్ రెవెన్యూ మండలంలోని సర్వేనెంబర్ 1లోని 23.27ఎకరాల భూమిని జీవో నెం. 701 ద్వారా 25 సంవత్సరాలకు హెచ్సీఏకి లీజుకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఏటా రూ. లక్ష లీజు కింద చెల్లించాలి. అయితే లీజు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. స్టేడియం మొత్తాన్ని వ్యాపారమయంగా మార్చి వేసిందని నోటీసులో పేర్కొన్నారు.
ఇటీవల స్టేడియంలో జరుగుతున్న కార్యకలాపాలపై ఒక
కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిపినట్టు ఆర్డీవో వెల్లడించారు. ఈ విచారణలో ఎన్నో ఉల్లంఘనలు గుర్తించినట్టు తెలిపారు. స్టేడియంలో సీసీఎల్ వంటి వాణిజ్యపరమైన క్రికెట్ మ్యాచ్లను నిర్వహిస్తూ పూర్తిగా ప్రైవేట్ సంస్థలకే పెద్దపీట వేస్తున్నట్టు విచారణలో నిర్దారించారని పేర్కొన్నారు.
ఆన్లైన్లో అధిక ధరలకు
ఐపీఎల్ కోసం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు స్టేడియాన్ని లీజుకు ఇచ్చి, దాన్ని వాణిజ్య ప్రయోజనాలకు వాడుకునేందుకు అనుమతించిదన్నారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను ఆన్లైన్లో అధిక ధరలకు విక్రయిస్తున్న విషయం విచారణలో గుర్తించినట్టు నోటీసులో పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా స్టేడియంలో అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్నారన్నారు.
లీజు డబ్బులు కూడా చెల్లించడంలేదని
మైదానాన్ని ప్రైవేటు కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వడం లీజు అగ్రిమెంట్కు విరుద్దమని పేర్కొన్నారు. లీజు డబ్బులు కూడా చెల్లించడంలేదని పేర్కొన్నారు. నియమ నిబంధనలు పాటించనందున హెచ్సీఏకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు ఆర్డీవో తెలిపారు. నోటీసుకు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించారు. హెచ్సీఏ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని పక్షంలో ల్యాండ్ రెవెన్యూ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో ఆర్డీవో హెచ్చరించారు.