IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఓ వార్త కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం 2 వారాల ముందు కెప్టెన్ అజింక్యా రహానే తన కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారనే వార్త సోషల్ మీడియా దావానలంలా వ్యాపించింది. మార్చి 12, 2026 తేదీతో ఉన్న ఈ ప్రకటన నిజమేనని చాలా మంది నమ్మారు. అయితే లోతుగా విచారించగా ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది.
వివాదం ఎలా మొదలైందంటే?
సోషల్ మీడియాలో అజింక్యా రహానే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లాగా కనిపిస్తున్న ఓ స్క్రీన్ షాట్ వైరల్ అయ్యింది. అందులో "కొత్త నాయకుడిని తయారు చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాను, అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఉంది. ఈ పోస్ట్ ప్రొఫెషనల్గా ఉండటంతో చాలా మంది దీనిని అధికారిక ప్రకటనగా భావించి షేర్ చేశారు.

అసలు నిజం ఏమిటంటే?
వైరలవుతున్న ఈ వార్తలపై లోతుగా విచారించగా.. ఇది పూర్తిగా అబద్ధమని తేలింది. అజింక్యా రహానే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లేదా ఎక్స్ హ్యాండిల్స్లో ఎక్కడా ప్రకటించలేదు. అలాగే కేకేఆర్ జట్టు యాజమాన్యం కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది ముంబై డొమెస్టిక్ టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నప్పుడు అజింక్యా రహానే చేసిన పాత ప్రకటనను ఎవరో ఆకతాయిలు ఎడిట్ చేసి కేకేఆర్ పేరుతో వైరల్ చేశారు.
కేకేఆర్ కెప్టెన్గా అజింక్యా రహానేనే..!
2024లో జట్టును ఛాంపియన్గా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్కు వెళ్లిన తర్వాత కేకేఆర్ పగ్గాలను అజింక్యా రహానేకు అప్పగించారు. గత సీజన్ జట్టుకు అంతగా కలిసిరాకపోయినా.. కేకేఆర్ యాజమాన్యం అజింక్యా రహానే అనుభవంపైనే నమ్మకం ఉంచింది. ఐపీఎల్ 2026లో కూడా అజింక్యా రహానే కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ముందుండి నడిపించనున్నారు. మార్చి 29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగే మ్యాచ్తో కేకేఆర్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.