ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా అత్యంత తెలివి తక్కువ జట్టు అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ విమర్శించాడు. సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఓడిపోయి ఉంటే.. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించేదని తెలిపాడు.
బలమైన జట్టుగా ఉన్న టీమిండియాను కాస్త తెలివిగా వ్యవహరించి ప్రపంచకప్ నుంచి బయటకు పంపించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడాన్ని మైఖేల్ వాన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఫైనల్లో న్యూజిలాండే గెలుస్తుందని కూడా జోస్యం చెప్పాడు. కానీ భారత్ గెలవడంతో సౌతాఫ్రికా తెలివి తక్కువ టీమ్ అని తన అక్కసు వెల్లగక్కాడు.
ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వంలోని సౌతాఫ్రికా.. అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్ చేరింది. కానీ కీలక సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మైఖేల్ వాన్.. సౌతాఫ్రికా టీమ్పై విమర్శలు గుప్పించాడు.

'ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత తెలివి తక్కువ జట్టు ఏదైనా ఉందా? అంటే అది సౌతాఫ్రికానే. ఎందుకంటే సూపర్-8 పోరులో వెస్టిండీస్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయి ఉంటే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించేది. కానీ ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలిచి భారత్ ప్రపంచకప్లో కొనసాగేందుకు అవకాశం కల్పించారు. తర్వాత టీమిండియా.. జింబాబ్వే, వెస్టిండీస్లపై విజయం సాధించి సెమీఫైనల్ చేరింది. సెమీస్లో ఇంగ్లండ్ను ఓడించింది. ఇలాంటివి జరగకూడదు. సాధారణంగా జరగవు కూడా. కానీ.. ప్రపంచకప్ గెలవాలంటే ఉత్తమ జట్టును త్వరగా టోర్నీ నుంచి బయటకు పంపాలి.’అని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
సూపర్-8 దశలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓడి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. రన్రేట్ దారుణంగా పడిపోవడంతో వెస్టిండీస్, సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ గెలిచి ఉంటే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించేది. కానీ సౌతాఫ్రికా విండీస్ను చిత్తు చేయడంతో భారత్ మార్గం సుగుమమైంది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి టైటిల్ను ఎగరేసుకుపోయింది.