మిర్పూర్లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఊహించని, వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా రనౌట్ అయిన తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల మధ్య, క్రీడా విశ్లేషకుల మధ్య 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' గురించి తీవ్ర చర్చకు దారితీసింది. ఓ ఆటగాడు నిబంధనల ప్రకారం ఔట్ అయినప్పటికీ.. ఆ సందర్భం మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరు, ఇది కేవలం గేమ్ అని మరికొందరు వాదిస్తున్నారు.
సాయం చేయబోయి బొక్కబోర్లా..
ఈ ఘటన పాకిస్థాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో జరిగింది. అప్పటికే సల్మాన్ అలీ ఆఘా 64 పరుగులతో క్రీజులో ఉండి మహ్మద్ రిజ్వాన్తో కలిసి 109 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్ ఆడిన ఓ బంతి బౌలర్ మెహిదీ హసన్ మిరాజ్ వద్దకు వెళ్లింది. నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న సల్మాన్ అలీ ఆఘా అప్పటికే క్రీజు దాటి కొంచెం ముందుకు వచ్చాడు. బంతి బౌలర్ అడుగుల వద్ద పడటంతో, బౌలర్కు బంతిని తిరిగి ఇచ్చి సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో సల్మాన్ అలీ ఆఘా కిందకు వంగి ఆ బంతిని తీయబోయాడు.

అయితే, ఈ క్రీడా స్ఫూర్తిని బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మిరాజ్ సానుకూలంగా తీసుకోలేదు. సల్మాన్ అలీ ఆఘా క్రీజులో లేని విషయాన్ని మెరుపు వేగంతో గమనించిన బౌలర్.. వెంటనే వికెట్లను బంతితో కొట్టేశాడు. దీనితో ఫీల్డ్ అంపైర్ సల్మాన్ అలీ ఆఘాను రనౌట్గా ప్రకటించారు. తనను ఔట్ చేసిన తీరుపై సల్మాన్ అలీ ఆఘా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీజును వీడేటప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్లతో ఆయన వాగ్వివాదానికి దిగాడు. అంపైర్లు నిర్ణయం తీసుకునే సమయానికి, ఆఘా గ్లౌజులు, బ్యాట్ను మైదానంలో విసిరికొడుతూ తన అసహనాన్ని ప్రదర్శించాడు.
మానసికంగా కుంగిపోయిన పాకిస్థాన్ జట్టు
ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ జట్టు మానసికంగా కుంగిపోయిందని చెప్పవచ్చు. సల్మాన్ అలీ ఆఘా ఔట్ అయిన కేవలం రెండు బంతులకే రిజ్వాన్ (44) కూడా ఔట్ కావడంతో, పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఒకానొక దశలో 231/3 స్కోరుతో పటిష్టంగా ఉన్న పాకిస్థాన్, ఆ తర్వాత వికెట్లను వరుసగా కోల్పోయి చివరకు 274 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి వన్డేలో ఓటమి పాలైన పాకిస్థాన్, ఈ రెండో వన్డేలోనైనా పుంజుకుని సిరీస్లో నిలవాలని భావించినప్పటికీ.. ఈ రనౌట్ వివాదం జట్టు అవకాశాలను దెబ్బతీసింది. 20 ఏళ్ల యువ బ్యాటర్ మాజ్ సదాకత్ (75 పరుగులు) మెరుపులు మెరిపించినా, కీలక సమయంలో జరిగిన ఈ రనౌట్ పాక్ అభిమానులకు పెద్ద షాకిచ్చింది.
పాకిస్తాన్ను నట్టేట ముంచిన బంగ్లాదేశ్
ఇది కేవలం ఒక రనౌట్ మాత్రమే కాదు.. 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' (క్రీడా స్ఫూర్తి)పై మరోసారి పెద్ద చర్చను లేవనెత్తింది. 2026 టీ20 ప్రపంచ కప్ విషయంలో భద్రతా కారణాల రీత్యా భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నప్పుడు పాకిస్థాన్ వారికి బహిరంగ మద్దతు ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు తమ ఆటగాడి పట్ల బంగ్లాదేశ్ ప్రవర్తించిన తీరుపై పాక్ అభిమానులు "నమ్మకద్రోహం" అని మండిపడుతున్నారు. నియమాల ప్రకారం సల్మాన్ అలీ ఆఘా అవుటే అయినప్పటికీ.. క్రీడా స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని బౌలర్ హెచ్చరించి ఉండాల్సిందని కొందరు వాదిస్తుంటే, ప్రత్యర్థి జట్టు క్రీజులో లేని విషయాన్ని వాడుకోవడం తప్పు కాదని మరికొందరు పేర్కొంటున్నారు. మొత్తానికి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ రనౌట్ వివాదంతో క్రికెట్ చరిత్రలో నిలిచిపోనుంది.