రావల్పిండి: ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో గెలిచే సువర్ణవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్నామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్ రూపంలో విజయ అవకాశం దక్కినా బ్యాటింగ్ వైఫల్యంతో అందుకోలేకపోయామని తెలిపాడు. మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా సోమవారం ముగిసిన తొలి టెస్ట్లో పాకిస్థాన్ 74 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓటమిపై స్పందించిన బాబర్ ఆజామ్.. పశ్చాతాపం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారని కొనియాడాడు.
'మేం మా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాం. మ్యాచ్ గెలవడానికి సెకండ్ ఇన్నింగ్స్ రూపంలో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాం. సెషన్లు సాగుతున్న కొద్ది వికెట్లు కోల్పోయాం. యువ ఆటగాళ్లతో కూడిన మా బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణించింది. దురదృష్టవశాత్తు హారిస్ రౌఫ్ తొలి ఇన్నింగ్స్లో గాయపడ్డాడు. హారిస్ లేకున్నా మా బౌలర్లు అద్భుత పోరాటం కనబర్చారు.
మా ప్రణాళికలకు కట్టుబడి రాణించాలనుకున్నాం. ఓవర్కు 7 పరుగుల చొప్పున ప్రత్యర్థి చెలరేగుతుంటే బౌలింగ్ చేయడం చాలా కష్టం. రెండో ఇన్నింగ్స్ రూపంలో మ్యాచ్ గెలిచేందుకు మాకు అవకాశం వచ్చింది. కానీ మేం సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేక మూల్యం చెల్లించుకున్నాం. ఈ మ్యాచ్లో చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుతంగా రాణించాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
22 ఏళ్ల తర్వాత పాక్ను సొంత గడ్డపై ఇంగ్లండ్ ఓడించింది. 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 96.3 ఓవర్లలో 268 పరుగులకు కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్(159 బంతుల్లో 12 ఫోర్లతో 76), ఇమామ్ ఉల్ హక్(77 బంతుల్లో 8 ఫోర్లతో 48) టాప్ స్కోరర్లుగా నిలవగా.. అజార్ అలీ(40), మహమ్మద్ రిజ్వాన్(46) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(4/22), జేమ్స్ అండర్సన్(4/36) నాలుగేసి వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. జాక్ లీచ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరొక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 657 పరుగుల భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో 264/7 పరుగుల వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది.