లండన్: స్వింగ్ను రాబట్టేందుకు తన వద్ద ఉన్న హ్యాండ్ శానిటైజర్ను బంతికి అంటించడంతో... ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ పేసర్ మిచ్ క్లేడన్ నిషేధానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సస్సెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతడు... గత నెలలో జరిగిన ఒక మ్యాచ్లో బంతికి శానిటైజర్ను పూసి బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో అతడు మూడు వికెట్లు దక్కించుకోవడం విశేషం.
కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్మితో సహా ఎటువంటి పదార్థాలను రాయకూడదనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రవేశపెట్టింది. దాంతో 37 ఏళ్ల క్లేడన్పై ఆగ్రహించిన సస్సెక్స్ జట్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా విచారణ జరిపిస్తోంది. 'బాల్ పై హ్యాండ్ శానిటైజర్ వేసినందుకు గాను మిచ్ క్లేడాన్ మీద ఈసీబీ సస్పెన్షన్ విధించింది. ఈ దశలో ఇంతకంటే ఎక్కువ చెప్పలేం' అని సస్సెక్స్ తమ వెబ్ సైట్ లో పేర్కొంది. దీంతో బాబ్ విల్లిస్ ట్రోఫీలో భాగంగా సర్రేతో జరిగే మ్యాచ్కు క్లేడన్ దూరమయ్యాడు. ఇక 37 ఏళ్ల మిచ్ క్లేడన్కు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఐసీసీ తాత్కాలిక నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. స్వింగ్, పట్టు చిక్కడం కోసం బంతిపై ఉమ్మిని రుద్దడాన్నినిషేధించింది. బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు ప్లేయర్స్ ఇకపై ఉమ్మిని ఉపయోగించకూడదు. ఒకవేళ ప్లేయర్ పొరపాటును మర్చిపోయి ఉమ్మి రుద్దితే అంపైర్లు కొంత వెసులుబాటు ఇస్తారు. మళ్లీ రుద్దితే మాత్రం వార్నింగ్ ఇస్తారు. రెండు వార్నింగ్స్ తర్వాతా ఇదే రిపీట్ అయితే 5 రన్స్ జరిమానా విధిస్తారు. ప్రత్యర్థి జట్టు ఖాతాలో వాటిని జమ చేస్తారని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిబంధనలను రూపొందించగా.. ఐసీసీ ఆమోదం తెలిపింది.