ఆదిలోనే షాక్..
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లీగ్ మ్యాచ్ల్లో చెలరేగిన షెఫాలీ వర్మ.. కీలక సమరంలో మాత్రం చేతులెత్తేసింది. కేవలం మూడు బంతులే ఆడి రెండు పరుగులే చేసి తొలి వికెట్గా వెనుదిరిగింది. దీంతో క్రీజులోకి వచ్చిన తానియా బాటియా.. బంతి తలకు బలంగా తాకడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. ఆ మరుసటి ఓవర్లలోనే జెమీమా రోడ్రిగ్స్(0) ఔటైంది. తర్వాత వరుస ఫోర్లతో జోరు కనబర్చిన మంధాన.. జొనస్సెన్ బౌలింగ్లో డీప్ స్క్వేర్ దిశగా భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్(4) కూడా భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్గా పెవిలియన్ బాట పట్టింది.
దీప్తీ, వేద పోరాడినా..
30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ను వేదకృష్ణమూర్తి, దీప్తి శర్మ నిదానంగా ఆడి గట్టెక్కించే ప్రయత్నం చేశారు. కానీ డిలిస్సా కిమ్మిన్స్ వేదను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. మిడాఫ్లో జొనస్సెన్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో వేద పోరాటం ముగిసింది. దీంతో భారత్ 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో గాయపడ్డ తానియా బాటియా స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా రిచా ఘోష్ బ్యాటింగ్కు దిగింది. అప్పటికే భారత్ ఆశలు ఆవిరయ్యాయి. కేవలం పరువు కోసం పాకులాడటం తప్ప చేయాల్సిందేం లేదు.
దీప్తీ ఔట్.. టపటపా..
దీప్తీ, రిచా కొంతసేపు వికెట్ పడకుండా అడ్డుకున్నప్పటికీ.. నికోలా క్యారీ దెబ్బతీసింది. దీప్తీని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి తన విజయం ఆలస్యం కాకుండా చూసుకుంది. దీప్తీ ఔటైన వెంటనే భారత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడల్లా కుప్పకూలింది. రిచా ఘోష్(18), శిఖా పాండే(2), రాధా యాదవ్(1), పూనమ్ యాదవ్(1) వరుసగా పెవిలియన్ క్యూకట్టగా.. రాజేశ్వరి గైక్వాడ్(1) నాటౌట్గా నిలిచింది.