
సిడ్నీ: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడటమో.. రద్దవడమో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభంకావాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పట్లో ఈ మెగాటోర్నీ నిర్వహణపై స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
అయితే ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లో క్రీడాటోర్నీలు నిర్వహించాలనే వాదన తెరపైకి వచ్చింది. కానీ, 16 దేశాలు పాల్గొనే ప్రపంచకప్ టోర్నీని అలా నిర్వహించడం సాధ్యం కాదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాత్రం ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ నిర్వహించడం కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే.. టీ20 ప్రపంచకప్ ఖచ్చితంగా వాయిదా పడుతుందని తెలుస్తుందని ఫించ్ పేర్కొన్నాడు. అయితే అది ఎన్ని రోజులు వాయిదా పడుతుందో.. కచ్చితంగా చెప్పలేమన్నాడు. అయితే ఆట ఒకసారి ప్రారంభమైతే స్టేడియంలో ప్రేక్షకులు ఉన్నారా.. లేదా.. అనే విషయానికి ప్రాధాన్యత ఉండదని ఫిచ్ తెలిపాడు. 'ఒకసారి ఆటపై దృష్టి పెట్టి.. ఆడటం ప్రారంభించాక.. ఖాళీగా ఉండే స్టేడియం ప్రభావం ఆటగాళ్లపై ఉండదు. మేం న్యూజిలాండ్తో ఒక వన్డే ఆడాం. మొదటి నాలుగు ఓవర్లు కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ, ఆ తర్వాత అలవాటు అయిపోయింది.'అని ఫించ్ చెప్పుకొచ్చాడు.
ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్లో కరోనా అదుపులోకి వస్తే 2020, టీ20 వరల్డ్కప్ను ఇక్కడే నిర్వహించే విధంగా, 2021లో జరిగే నిర్వహణను ఆస్ట్రేలియాకు ఇచ్చేలా పరస్పరం మార్పిడి చేసుకోవాలని సూచించాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్ ఆతిథ్య హక్కులను బీసీసీఐ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలానే ఐపీఎల్ను సెప్టెంబరులో నిర్వహించాలన్నాడు.
'సెప్టెంబరు వరకు ఆస్ట్రేలియాలో విదేశీయులకు అనుమతి లేదు. అక్టోబరు నెల మధ్యలో పొట్టి వరల్డ్కప్ ఆరంభం కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు టోర్నీ నిర్వహణకు అనుకూలంగా లేవు. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే ఇరు దేశాలూ ఆతిథ్య బాధ్యతలను పరస్పరం మార్చుకోవాలి. ఈ ఏడాది భారత్, వచ్చే ఏడాది ఆసీస్ నిర్వహించేలా ఒప్పందం చేసుకోవాలి' అని సన్నీ సూచించాడు.