India vs Pakistan: ఆ ముగ్గురితోనే టీమిండియాకు డేంజర్.. గెలవడం ఆశమాషి కాదు!

దుబాయ్: ఐసీసీ ఈవెంట్లలో భారత్‑పాకిస్తాన్ మ్యాచ్ జరగాలంటే కనీసం ఏడాది ఎదురు చూడాలి. కానీ, ఆసియా కప్ 2022 పుణ్యమా అని దాయాది జట్లు వారం రోజుల్లోనే రెండోసారి పోటీకి సిద్దమయ్యాయి. మెగా ఈవెంట్ గ్రూప్‑ఎలో పాక్పై ఉత్కంఠ విజయంతో బోణీ కొట్టిన టీమిండియా నేడు సూపర్‑4 రౌండ్ తొలి పోరులో ఆ జట్టును మళ్లీ ఢీకొట్టనుంది. గత ఫలితాన్ని పునరావృతం చేయాలని రోహిత్సేన భావిస్తుంటే.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కసిగా ఉన్నది. ఈ నేపథ్యంలో మరో 'సూపర్ సండే' క్రికెట్ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇవ్వనుంది.

ఆశమాషి కాదు..
పాక్తో తొలి పోరులో కష్టంగా గట్టెక్కిన భారత్.. కసి మీదున్న ఆ జట్టును మరోసారి ఓడించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. గాయం వల్ల స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సేవలు కోల్పోయిన రోహిత్సేన టాపార్డర్ తడబాటు, అనుభవం లేని పేస్ బౌలింగ్ ఎటాక్తో కాస్త ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో భారత్ చేతిలో ఓటమి నుంచి తేరుకొని హాంకాంగ్పై 155 రన్స్ తేడాతో రికార్డు విక్టరీ సాధించిన పాక్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. కాబట్టి రోహిత్సేన ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ముగ్గురితో ముప్పు..
భారత్ చేతిలో ఓటమి తర్వాత పాక్ బలంగా పుంజుకుంది. గత పోరులో హాంకాంగ్పై భారీ స్కోరు చేసిన పాక్ బౌలింగ్లో చెలరేగి ఆ జట్టును 38 రన్స్కే ఆలౌట్ చేసింది. ఓపెనర్ రిజ్వాన్ ఫామ్ కొనసాగించగా.. ఫఖర్ జమాన్, కుష్దిల్ షా కూడా టచ్లోకి రావడంతో టీమ్ బ్యాటింగ్ బలం పెరిగింది. ఈ పోరులో తొలి పది ఓవర్లలో ఎక్కువ రన్స్ చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇక, బౌలింగ్లో ఆ జట్టుకు తిరుగులేదు. స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది ప్లేస్లో వచ్చిన 19 ఏళ్ల నసీమ్ షా కొత్త హీరోగా మారాడు. పదునైన బాల్స్ వేస్తున్న అతని నుంచి భారత్ బ్యాటర్లకు ముప్పు తప్పకపోవచ్చు. మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ లెఫ్ట్-రైట్ స్పిన్ తో కూడా సవాల్ ఎదురవనుంది.

ద్రవిడ్ సైతం..
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం పాకిస్థాన్ బౌలింగ్ భీకరంగా ఉందని అంగీకరించాడు. షాహిన్ అఫ్రిది స్థానంలో వచ్చిన నసీమ్ షా అదరగొడుతున్నాడని, ఎలా చూసుకున్నా భారత కంటే పాక్ బౌలింగ్ చాలా బలంగా ఉందని చెప్పాడు. కానీ వ్యూహాత్మక తప్పిదాలతో ఆ జట్టు మూల్యం చెల్లించుకుందని చెప్పాడు. ఈ మ్యాచ్కు టీమిండియా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ దూరంగా ఉంటున్నాడని ద్రవిడ్ పేర్కొన్నాడు. అవేష్ ఖాన్ జ్వరం బారిన పడ్డాడని.., అందుకే నెట్ ప్రాక్టీస్కు కూడా దూరంగా ఉన్నాడని తెలిపాడు. పాక్ బౌలింగ్ బాగుందని ద్రావిడ్ కితాబిచ్చాడు. వారి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారని చెప్పాడు

నెమ్మదిగా ఆడుతామంటే..
ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్తో పాటు విరాట్ కోహ్లీ పవర్ప్లేలో నిదానంగా ఆడటంతో జట్టుకు మంచి ఆరంభం దక్కడం లేదు. పాక్పై కేఎల్ రాహుల్ డకౌట్ అవ్వగా.. రోహిత్, కోహ్లీ కూడా ఇబ్బంది పడ్డారు. పాక్ పేసర్ల బౌలింగ్లో స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయారు. దాంతో, చిన్న టార్గెట్ ఛేజింగ్లో జట్టు చివరి ఓవర్ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. జడేజాతో హార్దిక్ పాండ్యా వీరోచిత పోరాటంతో జట్టు గెలిచింది. ఇప్పుడు జడేజా టీమ్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్తో పాటు కేఎల్ ఫస్ట్ ఓవర్ నుంచే బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications