సైనీకే తొలి ప్రాధాన్యం
మంగళవారం ఆశిష్ నెహ్రా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'జట్టు కూర్పును ఓసారి పరిశీలిస్తే నవదీప్ సైనీకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్ గాయపడ్డ మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ స్థానాల్లో వచ్చారు. టెస్టు జట్టు ఎంపిక ప్రక్రియలో వారికన్నా సైనీ ముందున్నాడు. మొదట ఎంపిక చేశారంటే.. ఆ ఇద్దరికన్నా ప్రాధాన్యత ఎక్కువనే కదా!. బౌన్స్, అదనపు వేగం సైనీ బలాలు. ఇది టెస్టు మ్యాచు. కాబట్టి సైనీ ఎంపికే సరైంది' అని అన్నాడు.
వేగం, బౌన్స్ ఉన్నాయి:
'టీ నటరాజన్ ఆసీస్ గడ్డపై బాగా రాణించాడు. టెస్టుల్లో కూడా నటరాజన్కూ వికెట్లు దొరుకుతాయి. కానీ మహ్మద్ సిరాజ్లా అతడిని భారత్-ఏకు ఆడించి పరీక్షించలేదు కదా. భారత్-ఏ తరఫున నవదీప్ సైనీ విదేశాల్లో ఆడిన సంగతి తెలిసిందే. సాధారణంగా టెస్టుల్లో బ్యాట్స్మెన్ ఔటవ్వరు. వారిని ఔట్ చేయడమే అసలైన తేడా. పరిమిత ఓవర్ల క్రికెట్ సమయంలో పరిశీలించినప్పుడు సిడ్నీ పిచ్ ఫ్లాట్గా కనిపించింది. అలాంటి పిచ్లపై వేగం ఉపయుక్తంగా ఉంటుంది. సైనీలో అందుకు తగ్గ వేగం, బౌన్స్ ఉన్నాయి. కూకాబుర్ర బంతి మెరుపు పోయినప్పుడు అదనపు వేగం ఎంతో అవసరం' అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.
సిడ్నీకి సైనీనే అత్యుత్తమం
నవదీప్ సైనీ వేగంతో పాటు బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. నటరాజన్, శార్దూల్తో పోలిస్తే.. సైనీ మెరుగ్గా బౌన్సర్లు విసరగలడని తెలిపాడు. 'నవదీప్ నంబర్వన్ బౌలరని చెప్పను. అతడు ఇంకా మెరుగవ్వాలి. షోయబ్ అక్తర్, బ్రెట్ లీలా 145-150 కి.మీ వేగంతో అతడు బంతులు విసరలేడు. అయితే అతడి సగటు వేగం 140గా ఉంది. మిగిలిన వాళ్లతో పోలిస్తే సిడ్నీకి అతడే అత్యుత్తమం' అని నెహ్రా చెప్పుకొచ్చాడు.
ముగ్గురిలో ఒకరికి అవకాశం
సిడ్నీ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ ఆడడం ఖరారవ్వడంతో యువ పేసర్లు నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్.. ముగ్గురిలో ఒకరికి అవకాశం లభిస్తుంది. అయితే నటరాజన్కు రెడ్బాల్ క్రికెట్ అంతగా అనుభవం లేకపోవడంతో.. సైనీ, శార్దూల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సైనీ సరైనోడు అని కొందరు, శార్దూలే జట్టులోకి వస్తాడని ఇంకొందరు మాజీలు అంటున్నారు. మరి ఎవరు అవకాశం దక్కించుకుంటారో చూడాలి.
Sydney Test: స్వింగ్ చేయగలిగే బౌలర్ అవసరం.. ఆ ఇద్దరి కంటే శార్దూలే సరైనోడు!!