న్యూఢిల్లీ: గతంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ను టీమిండియా యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ కలిసినప్పుడు వారి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను అర్ష్దీప్ కోచ్ జశ్వంత్ రాయ్ తాజాగా మీడియాతో పంచుకున్నాడు. అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని అక్రమ్ కొనియాడనని, ఏమైనా నేర్చుకోవాలనుకుంటేనే తన దగ్గరకు రావాలని చెప్పాడని జశ్వంత్ రాయ్ గుర్తు చేసుకున్నాడు.
'సర్దార్జీ నువ్వు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నావు. నువ్వు గొప్ప బౌలర్వి. అయితే నువ్వు ఆటలో నిన్ను నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటే మాత్రం నా దగ్గరకు రావద్దు. నా నుంచి ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా అడగాలని అనుకుంటే ఎప్పుడైనా నన్ను కలవచ్చు అని చెప్పాడు. ఆరోజు రాత్రి హోటల్ రూమ్కు వెళ్లిన తర్వాత కూడా అర్ష్దీప్ అదే అలోచిస్తూ గడిపాడు. ఒకవేళ తను వసీమ్ను కలవడానికి వెళ్లకపోతే తనకంతా తెలుసునని ఎక్కడ అపార్థం చేసుకుంటాడోనని మరుసటి రోజే అతన్ని కలవడానికి వెళ్లానని అర్ష్దీప్ నాతో చెప్పాడు''అని కోచ్ జశ్వంత్ వివరించాడు. ఆ విధంగా వీరిద్దరూ కలుసుకున్నారని తెలిపాడు.
ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ బ్యాటర్ అసిఫ్ అలీ క్యాచ్ను అర్ష్దీప్ వదిలేయడంతో అతడిపై నెటిజన్లు ట్రోలింగ్తో విరుచుకుపడ్డారు. పాక్తో భారత్ ఓటమికి కారణమయ్యాడంటూ విమర్శించారు. అయితే వసీమ్ మాత్రం ఈ పంజాబీ ఆటగాడి టాలెంట్ను కొనియాడాడు. అతడిపై ట్రోలింగ్ ఆపేయాలని కోరిన విషయం తెలిసిందే.
క్యాచ్ వదిలేయడం మినహా ఆసియాకప్లో అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా డెత్ బౌలర్లలో పరుగులను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇతర బౌలర్ల నుంచి సహకారం లభించకపోవడంతో అతను విజయాలను అందించలేకపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరంగా ఉన్న అర్ష్దీప్.. సౌతాఫ్రికాతో సిరీస్ ఆడనున్నాడు.