హైదరాబాద్: కోచ్లకు నైపుణం ఉంటే సరిపోదని, ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలో కూడా తెలిసి ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేసిన తరుణంలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కుంబ్లే-కోహ్లీల మధ్య నెలకొన్న వివాదంపై గంగూలీ శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. 'క్రికెట్ కెప్టెన్ ఆట అని నా అభిప్రాయం. కోచ్ తనవంతుగా తోడ్పాటు అందిస్తూ జట్టు ముందంజ వేసేలా చేయాలి. చక్కటి ప్రెజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన మెరుగైన కోచ్ అయిపోరు. వ్యక్తులతో సరిగ్గా వ్యవహరించడం, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం లాంటివి చాలా అవసరం' అని దాదా అన్నాడు.
నైపుణం పరంగా ఎంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ఆటగాళ్లతో సరిగా వ్యవహరించకపోతే కష్టమని గంగూలీ అన్నాడు. గంగూలీ చేసిన వ్యాఖ్యలను బట్టి మాజీ కోచ్గా బాధ్యతలు నిర్వహించిన అనిల్ కుంబ్లేకి మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్ లేవని సూచాయగా చెప్పారని అంటున్నారు.
మరికొందరు మాత్రం టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. టీమిండియా కొత్త కోచ్ ఎంపిక చేసే క్రికెట్ సలహా కమిటీలో సౌరవ్ గంగూలీ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. [గెలిపించే సత్తా ఉన్నవాడినే కోచ్గా ఎంపిక చేస్తాం: గంగూలీ]
గతేడాది అనిల్ కుంబ్లేను కోచ్గా నియమించడంలో గంగూలీది కీలక పాత్ర పోషించారు. ప్రధాన కోచ్గా కుంబ్లే నిష్క్రమణ ముగిసిన అధ్యాయమని, ఇక భవిష్యత్తు గురించి ఆలోచించాలని సౌరవ్ అభిప్రాయపడ్డాడు. అంతకముందు మ్యాచ్లను గెలిపించగలిగే సత్తా ఉన్నవాడినే కోచ్గా ఎంపిక చేస్తామని గంగూలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.