ముంబై: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ స్వరూపమే మారనుంది. పునరుద్దరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఐసీసీ అనేక నిబంధనలను తీసుకొచ్చింది. బంతి మెరుపు కోసం ఉమ్మి ఉపయోగించకూడదని ఆటగాళ్లకి ప్రాథమికంగా ఆదేశాలు జారీ చేసింది. మైదానంలో కూడా ఆటగాళ్లు కనీసం 1.5 మీటర్లు భౌతిక దూరం పాటించాలని సూచించింది. ఇక అంపైర్లు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఓవర్ల మధ్యలో అంపైర్లు బంతిని అందుకోవాలంటే గ్లౌజ్లను ధరించడం తప్పనిసరి చేసింది.
అయితే కొవిడ్-19 కట్టడికి వివిధ దేశాలు పర్యాటక వీసాలపై నిషేధం విధించడంతో అంతర్జాతీయ మ్యాచ్ల్లో అంపైరింగ్ చేసేందుకు ఐసీసీ ప్యానల్లోని అంపైర్లు హాజరవడంపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో దేశవాళీ అంపైర్లతోనే ఆ మ్యాచ్లను నిర్వహించాలని ఐసీసీ ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే అంపైరింగ్ ప్రమాణాల విషయంలో సందేహాలు, ఆతిథ్య జట్లకు మద్దతుగా పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందనే వాదన రావడంతో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. అదే ఎక్స్ట్రా రివ్యూ ప్రపోజల్.
ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ఇరు జట్లకు ఇన్నింగ్స్కు రెండు రివ్యూలు అందుబాటులో ఉండగా.. వన్డే, టీ20ల్లో ఇన్నింగ్స్కు ఒక రివ్యూ తీసుకునే అవకాశం ఉంది. అనిల్ కుంబ్లే నూతన ప్రతిపాదన ప్రకారం మరో రివ్యూ ఇరు జట్లకు అదనంగా దక్కనుంది. అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం లేని దేశవాళీ అంపైర్ల తప్పిదాలను తగ్గించడం కోసమే.. ఎక్స్ట్రా రివ్యూ ప్రపోజల్ తీసుకొచ్చినట్లు అనిల్ కుంబ్లే తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టడ్ షో ఈ ప్రపోజల్ గురించి వివరించాడు.
'ట్రావెల్ ఆంక్షలు, క్వారంటైన్ నిబందనల కారణంగా అంపైర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. మనకు ఎలైట్ అంపైర్లు చాలా తక్కువగా ఉన్నారు. దీంతో స్థానిక అంపైర్లు ఉపయోగించుకోవడం మంచిదనిపించింది. కానీ దేశవాళీ అంపైర్లకు అంతగా అనుభవం ఉండదు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ అనుభవం చాలా తక్కువ. ఈ కారణంతో పాటు పక్షపాతంగా వ్యవహరిస్తారని 20 ఏళ్ల క్రితమే తటస్థ అంపైర్లను వాడటం ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమస్యను అధిగమించేందుకు ఇరు జట్లకు ఎక్స్ట్రా రివ్యూ ఇవ్వాలని ప్రతిపాదించాం. ఈ అదనపు రివ్యూ ఇరు జట్లకు మేలు చేయనుంది.'అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.
సాయం అందుకొని భారత్పై విద్వేషపూరిత వ్యాఖ్యలా? అఫ్రిదిపై కనేరియా ఫైర్