ఒంగోలు : ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడు వరుస ఓటముల తర్వాత విజయంతో గాడినపడ్డట్టు కనిపించిన తన్మయ్ సేన.. ఆంధ్రచేతిలో ఇన్నింగ్స్ 96 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. ఒంగోలు వేదికగా మంగళవారం ముగిసిన మ్యాచ్లో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 74.4 ఓవర్లలో 168 రన్స్కు ఆలౌటైంది. రవితేజ(72 నాటౌట్), తన్మయ్ (41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ప్రత్యర్థి బౌలర్ విజయ్ కుమార్ (5/25) ఐదు వికెట్లతో హైదరాబాద్ పతనాన్నిశాసించగా.. పృథ్వీ రాజ్ మూడు, శశికాంత్ రెండు వికెట్లు తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో హైదరాబాద్ 225 రన్స్కే ఆలౌటవ్వగా.. ఆంధ్ర ఫస్ట్ ఇన్నింగ్స్లో 489/8 డిక్లేర్ చేసింది.
రవితేజ ఒక్కడే..
సొంతగడ్డపై పోరులో వరుసగా నాలుగో రోజు కూడా ఆంధ్ర జోరు కొనసాగింది. మూడో రోజే మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్ గుప్పిట్లోకి తెచ్చుకున్నా.. ఆంధ్ర నాలుగో రోజు వరుస విరామాల్లో ప్రత్యర్థులను ఔట్ చేసి సునాయస విజయాన్నందుకుంది. రెండో ఇన్నింగ్స్ ఓవర్ నైట్ స్కోర్ 45/3తో చివరి రోజు ఆటను ప్రారంభించిన హైదరాబాద్ బ్యాట్స్మెన్ తమ తడబాటును కొనసాగించారు. ఓవర్నైట్ స్కోర్కు మరో 16 రన్స్ జతయిన అనంతరం తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, ఓవర్నైట్ బ్యాట్స్మన్ జావీద్ అలీ (19) ఔటవ్వగా.. మరో బంతి వ్యవధిలోనే వికెట్ కీపర్ కొల్లసుమంత్(0) క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ఈ ఇద్దరిని పృథ్వీరాజ్ పెవిలియన్కు చేర్చడంతో హైదరాబాద్ 61/5తో కష్టాల్లో పడింది.
ఈ స్థితిలో మరో ఓవర్ నైట్ బ్యాట్స్మన్ తన్మయ్ అగర్వాల్.. క్రీజులోకి వచ్చిన రవితేజ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ తన్మయ్ను విజయ్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే పెవిలియన్కు క్యూ కట్టినా.. మరో ఎండ్లో రవితేజ ఒంటరిపోరాటం చేశాడు. అతనికి తోడుగా రవికిరణ్ (73 బంతుల్లో1) డిఫెన్స్ చేస్తూ క్రీజులో పాతుకుపోయాడు. అతని సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రవితేజ ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకుంటూ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. బౌలర్ల సహనానికి పరీక్షగా మారిన ఈ జోడీని శశికాంత్ విడదీశాడు. రవికిరణ్ వికెట్లు ముందు బోల్తాకొట్టించి 9 వికెట్కు సమకూరిన 45 పరుగుల పార్ట్నర్షిప్కు ముగింపుపలికాడు. ఇక క్రీజులోకి వచ్చిన యుధ్వీర్(0) కూడా ఆ మరుసటి బంతికే ఔటవ్వడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆంధ్ర విజయం లాంఛనమైంది.
విజయ్ అల్విదా...
ఈ మ్యాచ్తో ఆంధ్ర సీనియర్ పేస్ బౌలర్, 33 ఏళ్ల డేవిడ్ పైడికాల్వ విజయ్ కుమార్ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. 2006లో బరోడాతో మ్యాచ్ ద్వారా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన విజయ్... హైదరాబాద్తో ముగిసిన మ్యాచ్లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. కెరీర్లో 71 రంజీ మ్యాచ్లు ఆడిన విజయ్ మొత్తం 248 వికెట్లు తీశాడు. షాబుద్దీన్ (75 మ్యాచ్ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్ అధిగమించాడు.సహచరులు బ్యాట్లు ఎత్తి 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో గౌరవించారు.