— venu_gopal_rao_fans (@CricketVideos16) March 15, 2020 |
అంతర్జాతీయ స్థాయి మ్యాచేనా?
ఆటగాళ్ల తీసికట్టిన ఆట.. పేలవ ఫీల్డింగ్ చూస్తుంటే ఇది అంతర్జాతీయ స్థాయి మ్యాచేనా? అనే సందేహం కలుగుతోంది. మొన్న ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే మరీ దారుణం. ఈ లీగ్లో విదేశీ ఆటగాళ్లు ఆడుతున్నా.. పాకిస్థాన్ క్రికెటర్ల ఆట మాత్రం మరీ అధ్వాన్నంగా తయారైంది. సీనియర్, జూనియర్ తేడాలేకుండా చెత్త ప్రదర్శనతో ఆటగాళ్లు అభిమానుల ట్రోలింగ్కు గురవుతున్నారు.
ఆ మధ్య సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సునాయస క్యాచ్ జారవిడిచి అభిమానుల ఆగ్రహానికి గురైతే.. తాజాగా అకీఫ్ జావేద్ మిస్ ఫీల్డ్ యావత్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. మరీ దారుణంగా.. క్రికెట్ నేర్చుకునే బుడ్డోడు కూడా అంత అధ్వాన్నంగా చేయడనేలా అతని ఫీల్డింగ్ ఉంది.
కాళ్ల కింది నుంచి..
కరాచీ కింగ్స్ ఇన్నింగ్స్లో రుమ్మన్ రయిస్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతిని వసిమ్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడాడు. అందరూ సింగిల్ వస్తుందని భావించారు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అకిఫ్ జావెద్ నిర్లక్ష్యంగా వ్యవహరించి బంతి అడ్డుకోలేకపోయాడు. ఎంతలా అంటే అతని కాళ్ల సందులో నుంచి బంతి బౌండరీ లైన్ తాకెంత. ఇది చూసిన కామెంటేటర్లకు, సహచర ఆటగాళ్లకు దాదాపు పిచ్చెక్కింది. ఇంత దారుణంగా ఫీల్డింగ్ చేస్తారా? అని ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఫీల్డింగ్ చేశావా? నిద్రపోయావా?
ఈ వీడియోను చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా జావెద్ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఫీల్డింగ్ చేస్తున్నవా? లేక నిద్రపోయావా? నువ్వేం క్రికెటర్రా అయ్యా? .. ఇంత దారుణమా? అని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఈ తరహా ఫీల్డింగ్ చిన్నపోరడు కూడా చేయడని మండిపడుతున్నారు. పాక్లో నాణ్యమైన క్రికెటర్లు తయారవ్వడం లేదనేందుకు ఇదే నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.
కరాచీ కింగ్స్ గెలుపు..
ఈ మ్యాచ్లో కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. హుస్సెన్ తలత్(37), ఫిల్ సాల్ట్ (25) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసి 4 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. దారుణ ఫీల్డింగ్తో ట్రోలింగ్కు గురైన అకిఫ్ జావేద్ ఒక వికెట్ తీయడం గమనార్హం.