20 నిమిషాలు ఓపికపట్టమని..
గబ్బా టెస్ట్ విజయంపై మాట్లాడుతూ.. రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ను 20 నిమిషాలు ఓపికగా ఆడమని మాత్రమే చెప్పానని రహానే తెలిపాడు.'ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఎవరి ఆట వాళ్లు ఆడాలని మేం అనుకున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను బరిలోకి వెళ్లాక పుజారాతో.. నువ్వు నీలాగే ఆడు. నేను వేగంగా పరుగులు చేస్తానని చెప్పా. ఆ సమయంలో త్వరగా 40 పరుగులు సాధిస్తే తర్వాత మ్యాచ్ గెలిచే అవకాశం ఉందని భావించా. 24 పరుగులు చేశాక నేను ఔటయ్యా. పంత్ క్రీజులోకి వస్తుండగా.. 'టీ విరామానికి 20 నిమిషాల సమయముంది. అప్పటి వరకూ జాగ్రత్తగా ఆడు' అని పంత్కు సూచించా. తర్వాత తన సహజసిద్ధమైన ఆట ఆడుకోమని చెప్పా.
యువ ఆటగాళ్ల సక్సెస్కు..
ఓడిపోతామనే భయం లేకపోవడమే యువ ఆటగాళ్ల సక్సెస్కు కారణమని నేను అనుకుంటున్నా. టీమిండియా తరఫున బాగా ఆడాలనే కసి వారిలో ఉంది. అలాగే ఐపీఎల్ కూడా ఉపయోగపడింది. అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడడం లాభపడిందని భావిస్తున్నా. దాంతో రిషభ్పంత్, వాషింగ్టన్, శుభమన్ ఇంత పెద్ద టోర్నీలో ఉత్సహంగా బరిలోకి దిగడంతో పాటు రాణించారు. మ్యాచ్కు ముందు బౌలర్లను నడిపించే బాధ్యత నీదేనని సిరాజ్తో అన్నాను. దాన్ని ఒత్తిడిగా భావించొద్దని, వీలు చిక్కినప్పుడల్లా ఇతర బౌలర్లతో మాట్లాడమని సూచించా. వారికి అవసరమైన సలహాలు, సూచనలు చేయమని కోరాను.
ఆ క్షణమే గెలుస్తామనుకున్నా..
టీ విరామం తర్వాత విజయానికి 80 పరుగుల దూరంలో ఉండగా గెలుస్తామనే భావన కలిగింది. చరిత్ర సృష్టించడానికి ఇదే సరైన సమయం. ఇది జీవితకాల అవకాశం. మళ్లీ ఇలాంటి సందర్భం రాదనిపించింది. ఇప్పుడు డ్రా గురించి ఆలోచించకుండా గెలవాలనే భావన కలిగింది. ఆ సమయంలో పంత్, వాషింగ్టన్ అద్భుతంగా ఆడారు. విజయం కోసం ప్రయత్నించమని వారికెవరూ చెప్పలేదు. అయినా లక్ష్యం దిశగానే సాగారు. విజయానికి 10 పరుగుల దూరంలో ఉండగా.. ఇప్పుడు చరిత్ర సృష్టించేలా ఉన్నామనిపించింది. నాలో భావోద్వేగాలు బయటపడనీయను. ఆ సమయంలో రోహిత్ పక్కన కూర్చున్నా. అతడేమో మనం గెలుస్తున్నాం అనే ఉత్సాహంతో ఉన్నాడు. నేనేమో ప్రతి బంతినీ గమనిస్తూ కూర్చున్నా. ఇది నిజమేనా కాదా అనే ఆశ్చర్యంలో మునిగిపోయా. అదో ప్రత్యేకమైన అనుభూతి. అప్పుడెలా స్పందించాలో అర్థం కాలేదు.
అందుకే లయన్కు జెర్సీ
మేం అందరం సంతకాలు చేసిన జెర్సీని లయన్కు ఇవ్వాలని అనుకున్నాం. ఒక బౌలర్గా 100 టెస్టులు ఆడటం అనేది గొప్ప విషయం. అది కూడా ఆస్ట్రేలియా జట్టులో స్పిన్ బౌలర్గా ఆడటం మరింత ప్రత్యేకం. ఒక క్రికెటర్గా అతడి ఘనతను గౌరవించాలి. ప్రతి ఒక్కరికీ మర్యాద ఇవ్వాలనే విషయం నేను ఈ ఆట నుంచే నేర్చుకున్నా. ఆటలో గెలుపోటములు పట్టించుకోకూడదు. తోటి ఆటగాళ్లను గౌరవించడమే ముఖ్యం. అందుకే లయన్కు టీమిండియా తరఫున గుర్తుగా జెర్సీ అందించాం. ఇప్పుడు నేను కెప్టెన్ కాదు. ఇకపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్పైనే నా దృష్టి నెలకొంది. జరిగిందంతా ఒక చరిత్ర. అది గతం. రాబోయే సిరీస్ గురించి ఆలోచిస్తూ ముందుకు సాగాలి.'అని రహానే చెప్పుకొచ్చాడు.