మెల్బోర్న్ సెంచరీ ప్రత్యేకం..
'నేను రన్స్ చేసినప్పుడల్లా జట్టు గెలిచింది. ఇది నాకు సంతోషాన్నిచ్చే అంశం. అయితే నా వ్యక్తిగత ఘనతల కంటే జట్టు మ్యాచ్లు, సిరీస్ గెలవడం నా దృష్టిలో చాలా పెద్ద అంశం. అందుకే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మెల్బోర్న్ సెంచరీ నాకు ప్రత్యేకం. లార్డ్స్ శతకమే నాకు ప్రత్యేకమైందని మెల్బోర్న్లో చెప్పాను. కానీ నా లార్డ్స్ సెంచరీ కంటే మెల్బోర్న్ సెంచరీ (112)నే మెరుగైందని చాలా మంది నాతో చెప్పారు. అందుకు ఎలా స్పందించాలో నాకర్థం కాలేదు. కానీ అడిలైడ్ టెస్టు తర్వాత పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని చూస్తే మెల్బోర్న్ టెస్టు సిరీస్కు ఎంతో కీలకమైంది. అక్కడ సెంచరీనే ప్రత్యేకమైందని నాకిప్పుడు అనిపిస్తోంది'' అని రహానె చెప్పాడు.
అందుకే మైదానం వీడలేదు..
ఇక టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై ఆసీస్ అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లు ఆటను బాయ్కట్ చేసే అవకాశం టీమిండియాకు ఇచ్చినా దానికి రహానే అంగీకరించలేదు. దీనిపై తాజాగా స్పందించిన రహానే.. 'సిడ్నీలో జరిగింది చాలా విచారకరం. సిరాజ్, ఇతర ఆటగాళ్లపై చేసిన జాతివివక్ష వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మేమంతా నిలబడ్డాం. ఇక ఆటను బాయకాట్ చేయడాన్ని నేను తిరస్కరించాను. క్రికెట్ ఆడేందుకునే ఇక్కడికి వచ్చామని చెప్పాను. అదే సమయంలో మా ఆటగాళ్లను మేం గౌరవిస్తాం. అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని బయటకు పంపిస్తే మా ఆటను కొనసాగిస్తామని స్పష్టం చేశాను.'అని రహానే చెప్పుకొచ్చాడు.
తాత్కలిక సారథిగా..
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోరపరాభవం తర్వాత పగ్గాలు అందుకున్న అజింక్య.. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36కే కుప్పకూలిన టీమిండియా.. ఆ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ కెప్టెన్ కోహ్లీ, పేసర్ మహ్మద్ షమీ లేకపోయినా తాత్కాలిక కెప్టెన్ రహానె సారథ్యంలో భారత్.. రెండో టెస్టులో బలంగా పుంజుకుని 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత సిడ్నీ టెస్ట్ను డ్రా చేసుకొని, గబ్బాలో గెలిచి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.