దాదా నుంచి కాల్ వచ్చింది:
తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజింక్య రహానే మాట్లాడుతూ... 'అడిలైడ్ టెస్టు ముగిసిన అనంతరం సౌరవ్ గంగూలీ నాకు కాల్ చేశాడు. చాలా సమయం మాట్లాడాడు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పాడు. వ్యక్తిగా, జట్టుగా నమ్ముతూ పోరాడాలని సూచించాడు. ఆ మాటలు ఎంతో స్ఫూర్తినింపాయి' అని తెలిపాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలింది. అయితే విరాట్ కోహ్లీ గైర్హాజరీతో పాటు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా యువ ఆటగాళ్ల అద్భుత పోరాటంతో సిరీస్ను భారత్ 2-1తో గెలుచుకుంది.
ద్రవిడ్ పాత్ర ఎంతో కీలకం:
యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించడంలో భారత మాజీ కెప్టెన్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్.. ఐపీఎల్ పాత్ర ఎంతో ఉందని అజింక్య రహానే తెలిపాడు. భయంలేని క్రికెట్ ఆడటానికి ఐపీఎల్ ఎంతో దోహదపడిందన్నాడు. యువ ఆటగాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిద్దడంలో ద్రవిడ్ ప్రధానపాత్ర పోషించాడని జింక్స్ కొనియాడాడు. భారత్-ఎ, అండర్-19 జట్లకు ద్రవిడ్ కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే. వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణించారు.
కోహ్లీ, నేను మంచి స్నేహితులం:
'విరాట్ కోహ్లీ, నేను మంచి స్నేహితులం. దేశం కోసం పోరాడాలనే ఆలోచిస్తాం. మీ అందరికీ ఓ విషయం చెబుతున్నా.. కోహ్లీ కెప్టెన్, నేను వైస్కెప్టెన్. కోహ్లీ వెళ్లేముందు ఏం జరిగిందో అనవసరం. అతడు మా సారథి. ఇంగ్లాండ్ సిరీస్లో బ్యాట్స్మన్గా నా పాత్రను ఆస్వాదిస్తా' అని జింక్స్ అన్నాడు. సిడ్నీ టెస్టులో మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కోవడాన్ని రహానే తీవ్రంగా ఖండించాడు. ఆటగాళ్లపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసేవారిని స్టేడియం నుంచి బయటకు పంపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించాడు.
ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్ట్:
భారత్తో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం రూట్ సేన బుధవారం చెన్నై వచ్చే అవకాశం ఉంది. జట్టు సభ్యులంతా ఆరు రోజులు క్వారంటైన్లో ఉంటారు. ఫిబ్రవరి 2 నుంచి ఇంగ్లీష్ ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ఆరంభంకానుంది.
టీమిండియాను బలమైన జట్టుగా ఆయనే తీర్చిదిద్దాడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్