
లండన్: ఆస్ట్రేలియా జట్టుని వారి సొంత గడ్డపై ఓడించిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీనే బలమైన జట్టుగా తీర్చిదిద్దాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుసేన్ అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడే కసిని ప్రస్తుత జట్టులో కోహ్లీనే రగిలించాడన్నాడు. టీమిండియాతో తలపడే టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు గట్టిపోటీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ఆరంభంకానుంది. రూట్ సేన బుధవారం చెన్నై రానుంది. జట్టు సభ్యులంతా ఆరు రోజులు క్వారంటైన్లో ఉంటారు.
తాజాగా స్కై స్పోర్ట్స్తో నాసర్ హుసేన్ మాట్లాడుతూ... 'ఏ జట్టు అయినా ఆస్ట్రేలియాకు వెళ్లి 36 పరుగులకే ఆలౌటైతే.. 1-0 తేడాతో సిరీస్లో వెనుకపడుతుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన పేసర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మొహ్మద్ షమీ లేకున్నా సిరీస్ గెలవడం.. అది కూడా మైదానం బయట కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కొన్నాక జరగడం చూస్తే భారత ఆటగాళ్లు భయపడనట్లు ఉన్నారు. ఇప్పుడు టీమిండియా బలమైన జట్టుగా మారింది. కోహ్లీనే టీంను అలా తీర్చిదిద్దాడు అని నేను అనుకుంటున్నా' అని అన్నాడు.
'స్వదేశంలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో ఏ తప్పూ చేయకపోతే టీమిండియా అత్యంత బలమైన జట్టుగా ఉంటుంది. కాబట్టి భారత్తో తలపడే సిరీస్లో ఇంగ్లాండ్ అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగాలి. నేను భారతదేశంలో చాలా రోజులు గడిపా. భారత్ vs ఇంగ్లాండ్ సమరంను గొప్ప సిరీస్లో ఒకటిగా చూస్తాను. ఇంగ్లాండ్ 15 మంది అత్యుత్తమ ఆటగాళ్లతో చెన్నై వెళ్లాలి. అప్పుడే విజయం సాధ్యం' అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుసేన్ పేర్కొన్నాడు.
భారత్ ఇటీవల బోర్డర్-గవాస్కర్ సిరీస్లో 2-1తేడాతో విజయం సాధించగా.. ఇంగ్లాండ్ సైతం శ్రీలంకను దాని సొంతగడ్డ మీదే 2-0తేడాతో చిత్తుచేసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ బలంగానే ఉన్నాయి. అయితే ఈ సిరీస్ స్వదేశంలో జరుగుతున్నందున భారత్ గెలవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చివరిసారి 2016లో ఇంగ్లండ్ ఇక్కడికి వచ్చినప్పుడు స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించారు. ఆ సిరీస్లో 93 వికెట్లు పడితే అందులో ఈ ఇద్దరే 54 వికెట్లు తీశారు. దీంతో ఈసారి కూడా స్పిన్ అస్త్రాన్నే ప్రయోగించాలని కోహ్లీసేన భావిస్తోంది.