అబుదాబి: టీ20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్కు ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ స్టేడియం పిచ్ చీఫ్ క్యూరేటర్ మోహన్ సింగ్ అనుమానస్పదంగా మృతి చెందారు. సరిగ్గా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే అతను తన గదిలో విగత జీవిగా కనిపించారు. అయితే అతని మరణానికి గల కారణాలు తెలియకపోయినప్పటికీ.. ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అబుదాబి పోలీసులు భావిస్తున్నారు.
మోహన్ సింగ్.. 2004లో అబుదాబికి వచ్చారు. అంతకుముందు పంజాబ్లోని మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ స్టేడియంలో క్యురేటర్గా ట్రైనింగ్ తీసుకున్నారు. అక్కడ ఆయన 1994లో చేరారు. తొలుత గ్రౌండ్ సూపర్వైజర్గా, తర్వాత కోచ్గా, సహాయకుడిగా సేవలందించారు. ఇక మ్యాచ్ ముందే క్యూరేటర్ అనుమానస్పద స్థితిలో మరణించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్లో కీలక మ్యాచ్కు పిచ్ను సిద్దం చేయడం, టీమిండియా భవితవ్యంపై ఈ ఫలితంపై ఆధారపడిన నేపథ్యంలో క్యూరేటర్ అకాల మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్య? లేక ఎవరైనా ఆగంతకులు హత్య చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
As we watch #NZvAFG at Abu Dhabi, another reminder that life is so fragile…the chief curator at AD passed away before the game..a personal tragedy because I knew Mohan Singh (from Mohali) ever since he moved to the UAE. Prayers, Mohan. You will be missed
— Hemant (@hemantbuch) November 7, 2021
మోహన్ సింగ్ అకాల మరణంపై బీసీసీఐ మాజీ చీఫ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. 'ఇది షాకింగ్ న్యూస్, మోహన్ సింగ్ నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఎంతో నిబద్దత, కష్టపతే తత్వం కలిగిన మనిషి. అతని కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నా'అని ఆయన పేర్కొన్నాడు.
అఫ్గాన్తో జరిగిన ఈ కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ సమష్టిగా చెలరేగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సగర్వంగా విలియమ్సన్ సేన సెమీస్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది.
నజీబుల్లా జడ్రాన్(48 బంతుల్ల 6 ఫోర్లు, 3 సిక్స్లతో 73) మినహా అంతా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/24), ట్రెంట్ బౌల్ట్(3/17) అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి 11 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. మరోసారి కెప్టెన్ కేన్ విలియమ్సన్(42 బంతుల్లో 3 ఫోర్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డేవాన్ కాన్వే(32 బంతుల్లో 4 ఫోర్లతో 36), మార్టిన్ గప్టిల్(23 బంతుల్లో 4 ఫోర్లతో 28) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.