ఐసీసీకి ఆకాష్ సూచనలు
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. విజేతను ప్రకటించడానికి ఐసీసీ ఒక సూత్రాన్ని కనుగొనాలని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఫుట్బాల్ ఆటలో విజేతను ప్రకటించాలంటే వాళ్లకు పెనాల్టీ షూట్ఔట్ లేదా మరో పద్ధతిని అవలంబిస్తారని, టెన్నిస్లో ఐదు సెట్లు నిర్వహిస్తారని సన్నీ గుర్తుచేశారు.
ఫైనల్లో ఐసీసీ నిబంధనలు సరిగ్గా లేవని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఎవరెన్ని చెప్పినా అంతిమంగా విజేత ఎవరో తేల్చాలని హైదరాబాద్ సొగసరి పేర్కొన్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా కూడా ఐసీసీకి పలు సూచనలు చేశాడు. ఐదు రోజుల్లో ఆడే.. 450 ఓవర్ల పూర్తి కోటా ఎందుకు ఆడించకూడదని ప్రశ్నించారు.
450 ఓవర్లు ఆడించాలి
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 450 ఓవర్ల పూర్తి కోటాను ఆడటానికి అవసరమైతే రిజర్వ్ డేతో పాటు అదనపు రోజును జోడించాలని ఆకాష్ చోప్రా ఐసీసీకి సూచించారు. 'డబ్ల్యూటీసీ ఫైనల్లో 6వ రోజు (రిజర్వ్ డే) ఉంది. దాంతో మనం చాలా సంతోషంగా ఉన్నాం. అయితే వర్షంతో ఇప్పుడు చాలా సమయం పోయింది. 450 ఓవర్లు ఆడించాలనే నియమం ఎందుకు లేదు?. మ్యాచ్ 6వ రోజు పూర్తవుతుందా? లేదా ఏడవ రోజుకు వెళుతుందా? అనేది కాదు.. 450 ఓవర్లు ఆడించాలి. అలా అని 10 రోజుల టెస్ట్ ఆడమని చెప్పడం లేదు. 450 ఓవర్లు పూర్తవ్వాలి నా ఉద్దేశం' అని ఆకాష్ చోప్రా స్టార్ స్పోర్ట్స్తో అన్నారు.
Younis Khan: బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న యూనిస్.. కారణం ఇదే?
2 సంవత్సరాలు వేచి చూశాం
'450 ఓవర్లు ఆడినా ఫలితం రాకపోతే.. ఇరు జట్లను విజేతగా ప్రకటించవచ్చు. ఇది ఇరు జట్లకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఈ చారిత్రాత్మక టెస్ట్ కోసం ప్రపంచం మొత్తం 2 సంవత్సరాలు వేచి చోస్తోంది. ఇంకా ఒక రోజు వేచి చూడలేరా?. 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టం.
ఇంత దూరం వచ్చాక ఫైనల్ విజేత తేలకుంటే బాగోదు' అని ఆకాష్ చోప్రా పేర్కొన్నారు. 'వర్షం కారణంగా ఎక్కువ ఓవర్లు కోల్పోతే టీమిండియాకు నష్టమే. ఎందుకంటే కివీస్ ఇప్పటికే పైచేయి సాధించింది. ఒక టెస్ట్ మ్యాచ్ గెలవటానికి 20 వికెట్లు కావాలి. న్యూజిలాండ్ ఇప్పటికే 10 వికెట్లు తీసింది. కోహ్లీసేనకు మాత్రం ఇంకా 18 అవసరం' అని ఆకాష్ చెప్పుకొచ్చారు.
మొదలైన మ్యాచ్
ఎట్టకేలకు ఆలస్యంగా ఇదో రోజు మ్యాచ్ ప్రారంభం అయింది. కొద్దిసేపటికే న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. మొహ్మద్ షమీ వేసిన 63.1 ఓవర్కు రాస్ టేలర్(11; 37 బంతుల్లో 2x4) ఔటయ్యాడు. అతడిచ్చిన క్యాచ్ను శుభ్మన్ గిల్ ముందుకు దూకి అందుకున్నాడు. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ (19), హెన్రీ నికోల్స్ (7) క్రీజులో ఉన్నారు. 69 ఓవర్లకు కివీస్ 134/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఇంకా 90 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.