ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో ఎప్పటినుంచో రాజకీయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన మాజీలు ఎందరో పీసీబీ బాధ్యతలు చేపట్టారు. అయితే అక్కడి రాజకీయాల కారణంగా చాలామంది గడువు పూర్తవకముందే.. రాజీనామాలు చేశారు. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ లాంటివారు బహిరంగానే చెప్పారు. బోర్డులో ముసలం ఉన్నట్లు మరోసారి బయటపడింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే మాజీ బ్యాట్స్మన్ యూనిస్ ఎటువంటి కారణాలను వెల్లడించలేదు.
పాకిస్తాన్ జట్టు త్వరలో ఇంగ్లండ్, వెస్టిండీస్లలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో యూనిస్ ఖాన్ కోచ్ పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జట్టు ఎంపిక విషయంలో తనను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ యూనిస్ రాజీనామా చేశాడని సమాచారం తెలుస్తోంది. అయితే కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణాలను అధికారికంగా వెల్లడించేందుకు యూనిస్ అయిష్టత వ్యక్తం చేశాడు.
ఇదేందయ్యో ఇది.. నేనెప్పుడూ చూడలే! 2 పరుగులకే ఆలౌట్.. 10 మంది డకౌటే! అత్యంత దారుణమైన ఓటమి!
బ్యాటింగ్ కోచ్ లేకుండానే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్, విండీస్ టూర్లకు వెళ్లనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు యూనిస్ ఖాన్ లాంటి దిగ్గజ ఆటగాడి సేవలను కోల్పోవడం పాక్కు పెద్ద లోటేనని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసిమ్ ఖాన్ వెల్లడించారు. యూనిస్ పాక్ తరఫున 118 టెస్ట్లు, 265 వన్డేలు, 25 టీ20 మ్యాచ్లు ఆడి.. 41 సెంచరీలు, 81 అర్ధ సెంచరీలతో దాదాపు 18,000 వేల పరుగులు చేశాడు. యూనిస్ ఖాతాలో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.
జూన్ 25వ తేదీ నుంచి పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్లో పర్యటించనున్నది. జూలై 20వ తేదీ వరకు పాక్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్నది. ఆ తర్వాత వెస్టిండీస్ టూర్కు వెళ్తుంది. జూలై 21 నుంచి ఆగస్టు 24 వరకు 5 టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నది.