బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉందని, ఒక్క టైటిల్ గెలిచి బోణీ చేస్తే వరుసగా మూడు ట్రోఫీలు సొంతం చేసుకుంటుందని ఆ జట్టు మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. గత 15 ఏళ్లుగా ఆడుతున్న ఆర్సీబీ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి హేమాహేమీలు ప్రాతినిథ్యం వహించినా.. ఆ జట్టు చాంపియన్గా నిలవకపోయింది. రెండు సార్లు ఫైనల్ చేరినా.. టైటిల్ అందుకోలేకపోయింది. ఆర్సీబీ తరుపున 12 సీజన్లు ఆడిన ఏబీ డివిల్లియర్స్.. అప్కమింగ్ సీజన్లో జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గా సేవలందించనున్నాడు.
ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్లో ఇప్పటిదాకా 15 సీజన్లు అయ్యాయి. కాబట్టి ఇప్పటిదాకా టైటిల్ గెలవని జట్లు, ఈసారి ఆ ముచ్చటను తీర్చుకునే పనిలో పడతాయి. ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నా. ఒక్కసారి టైటిల్ గెలిస్తే చాలు.. ఆ తర్వాత 2, 3, 4 వెంటవెంటనే గెలవగల సత్తా ఆర్సీబీకి ఉంది. ఆర్సీబీతో నా అనుబంధం చాలా ప్రత్యేకం. ఓ రకంగా ఆర్సీబీ నా జీవితాన్ని చాలా మార్చేసింది. ఈ జట్టుతో ఉన్న జ్ఞాపకాలు చాలా ప్రత్యేకం. నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఈ టీమ్లో ఉన్నారు. ఇది నాకు కుటుంబంలాంటిదే.. అందుకే మళ్లీ ఈ జట్టుతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా.'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2020,21 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2022 సీజన్లో ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ఆడింది. మొదటి ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ని ఓడించిన ఆర్సీబీ, రెండో క్వాలిఫైయర్లో రాజస్థాన్ రాయల్స్తో ఓడి మూడో స్థానానికి పరిమితమైంది. ఐపీఎల్లో 184 మ్యాచులు ఆడిన ఏబీ డివిల్లియర్స్, 5162 పరుగులు చేశాడు. మొదటి మూడు సీజన్లు ఢిల్లీ డేర్డెవిల్స్ తరుపున ఆడిన ఏబీ డివిల్లియర్స్, 2011 నుంచి 2021 వరకూ ఆర్సీబీ తరుపున ఆడాడు. ఐపీఎల్లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.