అహ్మదాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో (42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 75 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిసిన ఏబీడీ.. ఈ క్యాష్ రిచ్ లీగ్లో 5వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. దాంతో ఈ ఫీట్ సాధించిన రెండో ఓవర్సీస్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. 2011 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న మిస్టర్ 360 తన పాత టీమ్పైనే హాఫ్ సెంచరీ చేసి ఈ ఘనతను అందుకోవడం గమనార్హం. ఇక ఏబీడీ ఆరంభంలో ఢిల్లీ డేర్ డేవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్)కు ఆడిన విషయం తెలిసిందే. ఢిల్లీ తరఫున 28 మ్యాచ్ల్లో 671 రన్స్ చేసిన ఏబీడీ.. ఆర్సీబీ తరఫున 4,382 రన్స్ చేశాడు.
ఇక డివిలియర్స్ కన్నా ముందు ఓవర్సీస్ ప్లేయర్గా సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 5000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ 5390 రన్స్ చేయగా.. అతను కూడా ఆరంభంలో ఢిల్లీకే ఆడటం విశేషం. ఢిల్లీ తరఫున 55 మ్యాచ్లు ఆడిన వార్నర్ 1435 రన్స్ చేశాడు. ఓవరాల్గా అత్యధిక పరుగుల జాబితాలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 6041తో టాప్లో ఉండగా.. ఆ తర్వాత సురేశ్ రైనా(5472), శిఖర్ ధావన్ (5456), రోహిత్ శర్మ(5431) ఉన్నారు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, డివిలియర్స్ ఉండగా.. ఐదు, ఆరో స్థానంలో ఉండగా క్రిస్ గేల్(4891), ఎంఎస్ ధోనీ(4669), రాబిన్ ఊతప్ప(4607), గౌతమ్ గంభీర్(4217) టాప్-10లో కొనసాగుతున్నారు.