తండ్రి ఆరోగ్యం బాగోలేదు
తాజాగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఐపీఎల్ 2020కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. మలింగ తండ్రి ఆరోగ్యం బాగోలేదు. కొద్ది రోజుల్లోనే శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంది. అందుకే అతడు ఇంటి దగ్గరే ఉండి అన్ని చూసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు' అని పేర్కొన్నాడు. మలింగ లంక తరఫున 30 టెస్టులు, 226 వన్డేలు, 84 టీ20లు ఆడాడు.
ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుంది
లసిత్ మలింగ లేకపోతే ఐపీఎల్లో సందడి తగ్గుతుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. 'నిజం చెప్పాలంటే లసిత్ మలింగ లేకపోతే ఈ సీజన్ కాస్త వెలితిగా అనిపిస్తుంది. అతను అద్భుత బౌలర్. ఓవర్ మొత్తం యార్కర్ బంతులను వేయగలడు. ఐపీఎల్లోని 12 ఏళ్ల చరిత్ర మొత్తం చూస్తే.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మలింగ నిలిచాడు. అలాంటి పేసర్ లేకపోతే ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుంది. ఏదేమైనా అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' అని మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ అన్నాడు.
మళ్లీ బౌలింగ్ చేయకపోవచ్చు
'ఇవన్ని విషయాలు పక్కన పెడితే.. లసిత్ మలింగను మళ్లీ మనం ఐపీఎల్లో చూడకపోవచ్చు. నా ఉద్దేశం అతడు బౌలింగ్ చేయకపోవచ్చు. ఎందుకంటే.. మధ్యలో లంక పేసర్ బౌలింగ్ కోచ్గా మారాడు. తిరిగి జట్టులోకి వచ్చి మళ్లీ బౌలర్గా అవతారమెత్తాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్తో ఆడిన ఫైనల్ల్లో చివరి ఓవర్ వేసి.. ఆఖరి బంతికి ముంబైని గెలిపించాడు' అని ఆకాశ్చోప్రా గుర్తుచేసుకున్నాడు.
2016, 2018 సీజన్లకు కోచ్గా
ఐపీఎల్లో 2009 నుంచి ఆడుతున్న లసిత్ మలింగ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తరఫున 122 మ్యాచ్లు ఆడాడు. 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 2016, 2018 సీజన్లు ఆడలేదు. అప్పుడు ముంబై జట్టుకు బౌలింగ్ కోచ్గా సేవలందించాడు. మళ్లీ 2019లో పునరాగమనం చేసి ముంబైకి అద్భుత విజయాలు అందించాడు. ఇక 2021కి కోచ్గా ఉంటాడో, మళ్లీ బరిలోకి దిగి బౌలింగ్ చేస్తాడో చెప్పలేం. ఎం జరుగుతుందో చూడాలి.
మలింగ స్థానంలో ప్యాటిన్సన్
మలింగ స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ను ముంబై జట్టులోకి తీసుకుంది. ప్యాటిన్సన్ను గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఐపీఎల్ ప్లేయర్ వేలంలో ఏ ప్రాంచైజీ కొనుగోలుచేయలేదు. ప్యాటిన్సన్ కనీస ధర రూ .1 కోట్లు. కాగా మలింగ ఐపీఎల్ 2020 నుంచి తప్పుకోవడంతో అతన్ని ముంబై తీసుకుంది. ప్యాటిన్సన్ తన కెరీర్లో ఇప్పటివరకు 39 టీ20 మ్యాచ్ల్లో 47 వికెట్లు తీశాడు. ఏదేమైనా ఐపీఎల్ 2020కి మలింగ అందుబాటులో లేకపోవడం ముంబై జట్టుకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.